మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య | Man Commits Suicide In Kadapa | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

Aug 14 2019 6:42 AM | Updated on Aug 14 2019 6:43 AM

Man Commits Suicide In Kadapa - Sakshi

మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి

సాక్షి, బద్వేలు: కట్టుకున్న భార్య ప్రవర్తన సరిగా లేదని, నలుగురిలో అవమానంపాలు చేస్తుందన్న కారణంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. పట్టణంలోని నూర్‌బాషాకాలనీకి చెందిన అబ్దుల్‌గఫూర్, లక్ష్మిదేవిలకు ముగ్గురు కుమారులు కాగా వారిలో రెండవ వాడైన బీగాల మస్తాన్‌వలి (34) ఓ రైస్‌మిల్లులో ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈయనకు 13 ఏళ్ల కిందట ఆళ్లగడ్డకు చెందిన షమీనాతో వివాహమైంది. వీరికి అబ్దుల్‌గఫూర్, రియాజ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే సంవత్సరం నుంచి షమీనా ఇంటికి సమీపంలోని గౌస్‌పీర్‌ అలియాస్‌ మున్నా అనే వ్యక్తితో చనువుగా ఉంటోంది.

విషయం మస్తాన్‌వలికి తెలియడంతో పద్ధతి మార్చుకోమని తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో నాలుగైదు సార్లు పంచాయితీ జరిపినప్పటికీ షమీనా ప్రవర్తనలో మార్పు రాలేదు. సోమవారం బక్రీదు పండుగ కావడంతో షమీనా ఇంటి పట్టున లేకుండా గౌస్‌పీర్‌ ఇంటికి వెళ్లి ఉండటంతో అప్పుడే ఇంటికి వచ్చిన మస్తాన్‌వలి తిరిగి షమీనాతో గొడవకు దిగాడు. ఈ సమయంలో షమీనా, గౌస్‌పీర్‌లు నీవు చనిపోతే మేమిద్దరం కలిసి ఉంటామని మస్తాన్‌వలికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గొడవను చుట్టుపక్కల వారందరూ గమనించడంతో పాటు కట్టుకున్న భార్య అవమానకరంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురై ఇంట్లోకి వెళ్లి బయటకు రాలేదు. మంగళవారం ఉదయాన్నే ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పక్కనే ఉంటున్న అన్న మహమ్మద్‌రఫీ ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. అర్బన్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడానికి మరదలు షమీనా, గౌస్‌పీర్‌లే కారణమని మహమ్మద్‌రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement