ఘరానా మోసం

Man Cheated Women  - Sakshi

మెరకముడిదాం విజయనగరం : మండలంలోని భైరిపురం గ్రామానికి చెందిన శనపతి పార్వతి ఘరానా మోసానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే... భైరిపురానికి చెందిన పార్వతి నాలుగు రోజులు కిందట చీపురుపల్లి స్టేట్‌బ్యాంకులో తన ఖాతా పుస్తకం నిండిపోవడంతో కొత్త పుస్తకాన్ని తీసుకుంది. బుధవారం అజ్ఞాత వ్యక్తి ఆమెకు 9064541005 నెంబరుతో ఫోన్‌ చేసి నేను చీపురుపల్లి స్టేట్‌బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు.

మీరు రెండు రోజుల కిందట కొత్త పుస్తకం మార్చారు కదా...దానికి సంబంధించి మీ ఆధార్‌ కార్డు ఆన్‌లైన్‌ చేయాలని, మీ ఆధార్‌ కార్డు నెంబరు, మీ బ్యాంకు అక్కౌంట్‌ నెంబరు చెప్పాలని కోరాడు. నమ్మిన పార్వతి తన ఆధార్‌కార్డు నెంబరుతో పాటు తన అకౌంట్‌ నెంబరును కూడా  చెప్పింది. దీంతో ఆ అగంతకుడు పార్వతి బ్యాంకు ఖాతాలో వున్నరూ.23 వేలను డ్రా చేసాడు.  

గురువారం పార్వతి బ్యాంకుకు వెళ్లి తన ఖాతాలో  డబ్బులు ఎంత వున్నాయో సరి చూసుకుందామని వెళ్లగా బ్యాంకు అధికారులు రూ.23 వేలు డ్రా చేసినట్టు వున్న విషయాన్ని తెలిపారు. దీంతో ఆమె లబోదిబోమంటూ ఇంటిముఖం పట్టింది.

ఈ విషయమై స్థానిక సర్పంచ్‌ కెంగువ ధనుంజయకు తెలియజేయగా ఆయన బుధరాయవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే పార్వతికి అగంతకుడు చేసిన ఫోన్‌ నెంబరును ఇచ్చారు. దీనిపై బుధరాయవలస పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top