పోలీస్‌స్టేషన్‌లో ప్రేమికుల ఆత్మహత్య | Lovers Commit Suicide In Police station In Bijnor | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌లో ప్రేమికుల ఆత్మహత్య

May 16 2018 7:51 AM | Updated on Nov 6 2018 8:16 PM

Lovers Commit Suicide In Police station In Bijnor - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో : ఇద్దరు ప్రేమికులు పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన బిజ్నూరు జిల్లాలోని నూర్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డగించడంతో ఆందోళనకు గురై ఈ దారుణానికి సిద్ధపడ్డారు. వివరాల్లోకి వెళితే.. టకిపూరాకి చెందిన సుమిత్‌, అంజలిలు గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినప్పటికి పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరనే భయంతో ఇంట్లో నుంచి పారిపోయారు. సోమవారం రాత్రి తమ స్నేహితుడు అన్జు సహాయంతో బైక్‌పై బయలుదేరారు. తెల్లవారు జామున 3.30 గంటలకు నూర్‌పూర్‌కు చేరుకున్నారు.

ఆ సమయంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు బైక్‌పై ఇద్దరు యువకులు, ఓ యువతి ఉండటంతో అనుమానం వచ్చి వారిని అడ్డగించారు. కాగా అంజలి ‘నేను సుమిత్‌ ప్రేమించుకుంటున్నామని.. ఇంటి నుంచి పారిపోయి వచ్చామని.. ఇందుకు మా స్నేహితుని సహాయం తీసుకున్నాం​’  అని పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం వారి తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు తీసుకుని వారికి సమాచారం ఇచ్చి.. వారిని పోలీస్‌స్టేషన్‌కి తీసుకొచ్చారు. అయితే ఉన్నట్టు ఉండి అంజలి, సుమిత్‌లకు అస్వస్థతకు గురికావడంతో వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు.

పోలీసులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో భయానికి గురైన అంజలి, సుమిత్‌లు తమ వెంట తెచ్చుకున్న విషపు మాత్రలు తీసుకున్నారు. బాధితుల తల్లిదండ్రుల కూడా పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు చనిపోయారని ఆరోపించారు.  ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అందులో భాగంగా బీజ్నూర్‌ ఎస్పీ ఉమేశ్‌ కుమార్‌ను విధుల నుంచి తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement