యువతి, యువకుడు బలవన్మరణం

Love Failure Couple Commits Suicide in Vikarabad - Sakshi

పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదని..

ఒకే ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య  

కుల్కచర్ల: వరుసకు ఇద్దరూ అక్కాతమ్ముడు. అయినా, వారి మనసులు కలిశాయి. కొంత కాలంగా ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న పెద్దలు.. వరుస సరికాదు.. వద్దని వారించి సర్దిచెప్పారు. తమ ప్రేమను కుటుంబీకులు అంగీకరించడం లేదని మనోవేదనకు గురైన యువతి, యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని తనువు చాలించారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని కామునిపల్లిలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్రశాంత్‌ (19) అదే గ్రామానికి చెందిన ఓ యువతి(20) పదో తరగతి వరకు చదివారు. యువతి ఇంటి వద్దే ఉంటోంది. వీరిద్దరూ వరుసకు అక్కాతమ్ముడు. ప్రశాంత్‌ తల్లిదండ్రులు నగరంలో ఉంటూ సెంట్రింగ్‌ పనిచేస్తున్నారు.

యువకుడు వారికి సాయంగా ఉంటే అక్కడే ఉంటున్నాడు. కొంతకాలంగా ప్రశాంత్, యువతి ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల వారు విషయం తెలుసుకొని వారించారు. వరుస సరికాదని వద్దని సర్దిచెప్పి హెచ్చరించారు. అయినా, యువతి, యువకుడు తమ ప్రేమను కొనసాగించారు. ప్రశాంత్‌ సోమవారం స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున యువతితోపాటు ప్రశాంత్‌ తన ఇంట్లో ఒకే ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొరుగింటి వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రశాంత్‌ తండ్రి గోపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top