సెల్‌ఫోన్‌ వైద్యం చేశారు.. మా చిన్నారులను చంపేశారు! | Incident in Vikarabad | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ వైద్యం చేశారు.. మా చిన్నారులను చంపేశారు!

Jun 2 2026 6:00 AM | Updated on Jun 2 2026 6:00 AM

Incident in Vikarabad

డాక్టర్లపై బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణ

వైద్యంలో నిర్లక్ష్యం లేదని వైద్యుల వివరణ

అనంతగిరి: వికారాబాద్‌లోని మహవీర్‌ జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయాయంటూ బాధిత కుటుంబాలు ఆరోపించాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నవాబుపేట మండలం మీనపల్లికలాన్‌కు చెందిన మధుకర్, మౌనిక దంపతుల ఐదు నెలల పాపకు ఆదివారం రాత్రి తీవ్ర జ్వరం వచ్చింది.

దీంతో రాత్రి 2 గంటలకు మహవీర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చాలాసేపటి వరకు పట్టించుకోని వైద్యులు నింపాదిగా వచ్చి చికిత్సలు ప్రారంభించారు. సెల్‌ఫోన్‌లో సీనియర్ల సలహాలు తీసుకుంటూ పలు టెస్టులు రాశారు. సోమవారం వేకువజామున 4 గంటలకు చిన్నారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంవల్లే తమ పాప మృతి చెందిందని ఆరోపించారు.

మరో ఘటనలో..
అంతకుముందు జరిగిన మరో ఘటనలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ బంధువుల గ్రామమైన చించల్‌పేట్‌కు వచ్చింది. తన 18 నెలల బాబు అస్వస్థతకు గురికావడంతో అర్ధరాత్రి 12 గంటలకు మహవీర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ వైద్యం చేస్తుండగానే బాబు మృతిచెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు చనిపోయాడని బాధితురాలు వాపోయింది. కాగా, తాము సకాలంలోనే వైద్యం అందించామని, ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement