వికారాబాద్: ‘నా భర్త కొందరి వద్ద రూ.8 లక్షలు అప్పు గా తీసుకున్నాడు. దానికి వడ్డీతో కలిపి సదరు వ్యక్తులు రూ.83 లక్షలు చేశారు. అప్పు కట్టాలని మానసికంగా వేధించారు. బెదిరించారు. చివరకు ఆయన చావుకు కారణమయ్యారు. వారిని కఠినంగా శిక్షించాలి’ అని దొంగ ఎనికేపల్లి గ్రామానికి చెందిన శేరి అశ్విని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
గత నెల 20న ఆమె భర్త శేరి రాంరెడ్డి సూసైడ్ లెటర్ రాసి, ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా ఆమె సూసైడ్ నోట్లో భర్త పేర్కొన్న అంశాలను వెల్లడించారు. ‘పూడూరు మండలం మన్నెగూడ గ్రామానికి చెందిన బిజ్జి పద్మమ్మ, మోసిన్ ఖాన్, వసీం ఖాన్, అర్జున్, రాజు, సల్మాన్ ఖాన్, అజీమ్, కురువ మహేందర్ అనే వ్యక్తులు నన్ను ఇబ్బందులకు గురిచేశారు.
రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నప్పటికీ.. ఆ డబ్బులకు నెలకు రూ.40 వేల చొప్పున వడ్డీ కలిపి మొత్తం కలిపి రూ.83 లక్షలు చేశారు. అప్పు కింద మా రెండు ఎకరాల 14 గంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయినప్పటికీ అదనంగా డబ్బులు ఇవ్వాలని వేధించారు. అందుకే చనిపోతున్నాను’ అని నా భర్త లేఖ రాశారని ఆమె తెలిపింది. ఇదే విషయమై పోలీసులకు భర్త చనిపోయిన రోజే ఫిర్యాదు చేశానని, అయినప్పటికీ వారు స్పందించ లేదని ఆరోపించారు. కుటుంబ పెద్దను కోల్పోయి కొడుకుతో అనాథగా మిగిలానని తెలిపింది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి, నా భర్త చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


