సాక్షి, వికారాబాద్: తన ప్రేమకు అడ్డొస్తారని భావించి తల్లిదండ్రులకు ఓవర్డోస్ ఇంజెక్షన్లు ఇచ్చి చంపింది ఓ కూతురు. జిల్లాలోని యాచారంలో కొన్ని నెలల కిందట జరిగిన ఈ ఘటన.. తెలుగు రాష్ట్రాలను నివ్వెరపోయేలా చేసింది. ఇప్పుడు అదే జిల్లాలో మరో ‘ప్రేమ విడ్డూరం’ చోటు చేసుకుంది.
తాండూరులో చేతబడి కలకలం రేగింది. తన కూతురు ప్రేమ విఫలం కావాలని ఓ తల్లి ఏకంగా మంత్రగాళ్లను ఆశ్రయించింది. తీరా పూజలు జరుగుతున్న టైంలో కొందరు యువకులు అడ్డుకోవడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇందిర అనే యువతి గతకొంతకాలంగా ఓ యువకుడ్ని ప్రేమిస్తోంది. అయితే ఇది నచ్చని ఆమె తల్లి ఎలాగైనా ఆ ప్రేమ పెటాకులు చేయాలనుకుంది. తన కూతురు మనసు మారాలంటే మంత్రమే సరైన మార్గమని భావించింది. వెంటనే గుండు దేవుడు అలియాస్ గుండప్పను సంప్రదించింది.
ఇద్దరూ కలిసి రాత్రిపూట నిర్మానుష్య ప్రదేశంలో పూజలకు ప్లాన్ చేశారు. పెళ్లి త్వరగా కావాలని పూజలు చేద్దామని కూతురిని ఒప్పించి కూర్చోబెట్టింది ఆ తల్లి. అయితే.. పూజలు జరుగుతున్న టైంలో అటుగా వెళ్తున్న కొందరు యువకులు అది గమనించారు. గట్టిగా నిలదీయడంతో పాటు గుండప్పకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో పోలీసులు ఆ తల్లిని మందలించి పంపించేశారు.


