Mother daughter
-
అమ్మబాటలో.. రికార్డుల వేటలో..
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అన్నారు పెద్దలు. అంటే శిశువులు, పశువులే కాదు.. పాములు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయట. అదీ సంగీతానికి ఉన్న మహత్త్యం అని చెబుతుంటారు. గానంతో మేఘం వర్షిస్తుంది.. అగ్ని ప్రజ్వలిస్తుంది అంటారు. అందులో నిజమెంతుందో తెలియదు గానీ, అప్పుడెప్పుడో ఆ తల్లి నేర్చుకున్న సంగీత ఓనమాలను ఆమె పిల్లలు పట్టేశారు. పెళ్లి, పిల్లలు తర్వాత కూడా ఆటవిడుపుగా నేర్చుకున్న ఆ సంగీతాన్ని ఇద్దరు చిన్నారులు అవపోసన పట్టేశారు. ఇప్పుడు తల్లితో పాటు ఆ గారాలపట్టీలు ఇద్దరూ అరుదైన రికార్డును సొంతం చేసుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. 18 దేశాలకు చెందిన కీబోర్డు కళాకారులు పాల్గొన్న కార్యక్రమంలో ఒకే కుటుంబానికి చెందిన ఆ ముగ్గురికి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ రాష్ట్రం కేపీహెచ్బీకాలనీ ఐదో ఫేజ్కు చెందిన తల్లి మేడిది లలితకుమారి తన ఇద్దరు కుమార్తెలు ఎనిమిదేళ్ల లీషా ప్రజ్ఞ, ఐదేళ్ల మేడిది అభిజ్ఞతో కలిసి గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. నెడిది జానకిరామరాజు, లలితకుమారి దంపతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కొమరగిరి పట్నంలో లలితకుమారి తన ఏడో ఏటా పియానో వాయించడం నేర్చుకున్నారు. అప్పట్లో కేవలం రెండు పాటలు మాత్రమే నేర్చుకోగా పెళ్లి అనంతరం కీ బోర్డు కొనుక్కుని స్వతాహ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆన్లైన్ తరగతులకు హాజరై కీబోర్డుపై మరింత పట్టు సాధించారు. ఆమె ఆసక్తిని గమనించి భర్త జానకిరామరాజు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చారు. లలిత కుమారి సాధన చేస్తుంటే తన ఇద్దరు కుమార్తెలు లిషా ప్రజ్ఞ, అభిజ్ఞలు సైతం అనుసరించడం మొదలుపెట్టారు. ఇద్దరూ కూడా తల్లి ఇంట్లో పియానో కీబోర్డుపై ప్రాక్టీస్ చేయడం చూసి వారికి కూడా ఆసక్తి కలిగింది. ఇంకేం.. వారు సైతం బుల్లి పియానో కీబోర్డు కొనిపించుకుని తల్లితో పాటు ఆన్లైన్ క్లాస్లకు హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. తైక్వాండో, స్విమ్మింగ్లో సైతం ప్రతిభ అక్కా చెల్లెళ్లు లిషాప్రజ్ఞ, అభిజ్ఞలు తైక్వాండోలో సైతం రాణిస్తున్నారు. తైక్వాండో నేర్చుకుంటున్న అకాడమీలో జరిగిన ఏజ్ గ్రూప్ పోటీల్లో బంగారు పతకాలను సాధించి నేటితరం చిన్నారులకు స్ఫూర్తిగా నిలిచారు. అంతేకాకుండా ఇద్దరు చిన్నారులు స్విమ్మింగ్లో సైతం రాణిస్తుండటం గమనార్హం. లిషా ప్రజ్ఞ సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్లో నాల్గో తరగతి చదువుతుండగా, అభిజ్ఞ మాంటిస్సోరి స్కూల్లో కిండర్ గార్టెన్లో చదువుతోంది. గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు తల్లీ కూతుళ్లు గత ఏడాది డిసెంబర్ 1న గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు సృష్టించడానికి హాలెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి గంట వ్యవధిలో ఇన్స్ట్రాగామ్ వేదికగా వీడియోలను అప్లోడ్ చేశారు. దీనికి లండన్లోని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత రిచర్డ్ స్టన్నింగ్ విజేతలను ప్రకటించగా, అందులో తల్లి, తన ఇద్దరు కూతుళ్లు ఉండటం విశేషం. డిసెంబర్ 9న లండన్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా రిచర్ట్ స్టన్నింగ్ వారిని అభినందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న మణికొండలో జరిగిన వేడుకల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అంగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. అతి పిన్న వయస్సులోనే ఈ రికార్డు నెలకొల్పినందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులను అభినందించారు. -
44 ఏళ్ల తర్వాత తల్లి చెంతకు కూతురు..! ట్విస్ట్ ఏంటంటే..
ఇక కనపడదు అనుకున్న కూతురు కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఆ తల్లి ఆనందం మాటలకందనిది. ఏ దేవుడి ఇచ్చిన వరం అనే భావన కచ్చితంగా కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవమే ఎదురైంది ఈ తల్లికి.దక్షిణకొరియాకి చెందిన హాన్ టే మే 1975లో ఆరేళ్ల కూతురుని ఇంటి వద్ద వదిలేసి మార్కెట్కి వెళ్లింది. పని ముగించుకుని ఇంటికి తిరిగి రాగానే కూతురు క్యుంగ్-హా అదృశ్యమై ఉంది. దాంతో ఆమె కూతురు కోసం గాలించిన ప్రాంతం అంటూ లేకుండా కళ్లు కాయలు కాచేలా వెతికింది. అయితే ప్రయోజనం శూన్యం. ఇక విసిగి వేసిరిపోయినా ఆమె ..ఇక తన కూతురు కనిపించిదనుకుని ఆశలు వదులేసుకుంది. అయితే 2019లో అనూహ్యంగా కమ్రా అనే డీఎన్ఏ మ్యాచ్ ద్వారా తన కూతురుని తిరిగి పొందగలిగింది. ఇది విదేశీ కొరియన్ దత్తత తీసుకున్న వారి డీఎన్ఏతో జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనుసంధానం చేసే కమ్యూనిటీ. దీని సాయంతో తన బిడ్డను కలుసుకుంది. కాలిఫోర్నియాలో నర్పుగా పనిచేస్తున్న బెండర్తో హెన్ టే డీఎన్ఏ మ్యాచ్ అయ్యింది. గుర్తింపు నిర్థారించుకోవడానికి బెండర్, హాన్టే ఫోన్ కాల్లో ఇరువురు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బెండర్ సియోల్కి వెళ్లి తన తల్లి హాన్ టేని కలవగానే భావోద్వేగానికి గురయ్యారు. కానీ హాన్ టేకి అదంతా సభ్రమాశ్చర్యంగా ఉంది. నిజమేనా..? కాదా అనే సందిగ్ధంలో ఉండిపోయింది. అయితే బెండర్ జుట్టుని తాకి అది తన కూతురే అని నిర్థారణ చేసుకుని ఆలింగనం చేసుకుంది. 30 ఏళ్లుగా హెయిర్ డ్రస్సర్గా పనిచేస్తున్న హాన్ టే ఆ అనుభవంతోనే కూతురు జుట్టుని తాకి తన బిడ్డే అని నిర్థారించుకుంది. ఈ మేరకు హాన్ టే కూతురు క్యుంగ్ మాట్లాడుతూ..ఒక వింత మహిళ తన వద్దకు వచ్చి నీ తల్లికి ఇక నీ అవసరం లేదంటూ..తనను రైల్వేస్టేషన్కి తీసుకువెళ్లిపోయిట్లు తెలిపింది. అక్కడ పోలీసు అధికారులు తనను ఎత్తుకుని ఒక అనాథశ్రమంలో ఉంచారని, అక్కడ నుంచి అమెరికాకు తరలించారని తెలిపింది. అయితే అక్కడ వర్జీనియాలో ఒక జంట తనను దత్తత తీసుకుందని చెప్పుకొచ్చారామె. ఇక హాన్ టే ఇన్నాళ్ల తన మనో వేదనకు గానూ..దక్షిణ కొరియాలో కొనసాగుతున్న విదేశీ దత్తత కార్యక్రమాన్ని సవాలు చేస్తూ.. ప్రభుత్వంపై దావా వేసింది. అలాగే తన కుమార్తె కనపడక ఎంత నరకయాతన అనుభవించానో చెప్పలేను, ఓ పిచ్చిపట్టినదానిలో క్షోభను అనుభించానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారామె. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో వరుసగా వచ్చిన దక్షిణ కొరియా ప్రభుత్వాలు పారిశ్రామిక లబ్ధి కోసం ఇలా పిల్లలను పెద్ద ఎత్తున సామూహికంగా ఎగుమతి చేసినట్లు ఆరోపణలు రావడమేగాక విచారణలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతునట్లు తేలింది. (చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..) -
మిస్టరీగానే తల్లి, కుమార్తె మరణం
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తల్లి, కుమార్తె మరణం మిస్టరీగానే మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి తన అక్క కుమార్తె రాజేశ్వరీ(34)ని 2008లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్ మేనేజర్గా బదిలీపై 15ఏళ్ల క్రితమే మిర్యాలగూడకు వచ్చి హౌసింగ్బోర్డులో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ(13) సంతానం. ఈ నెల 10న కంపెనీ బడ్జెట్ ఆడిట్ సమావేశం ఉండటంతో సీతారాంరెడ్డి హైదరాబాద్కు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సీతారాంరెడ్డికి గొంతుపై గాయాలతో చిన్న కుమార్తె వేద సాయిశ్రీ, బెడ్రూంలో ఉరేసుకుని భార్య రాజేశ్వరీ మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. నోరు విప్పని పెద్ద కుమార్తె..సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ నోరు విప్పితేనే రాజేశ్వరీ, వేద సాయిశ్రీ మృతికి గల కారణాలు తెలుస్తాయి. కానీ ఆమె మాత్రం తాను శుక్రవారం రాత్రి నిద్రపోగా శనివారం మధ్యాహ్నం మేలుకువ వచ్చిందని చెబుతోంది. దీంతో వారిపై మత్తు పదార్ధాల ప్రయోగం జరిగిందా..? అనే అనుమానాలకు తావిస్తోంది. అయితే సీతారాంరెడ్డి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వస్తున్న సమయంలో ‘ఎక్కడ ఉన్నావు డాడీ’ అంటూ మెసేజ్ చేయడం, తల్లి ఫోన్కు వరుసగా వస్తున్న ఫోన్ కాల్స్ను కట్ చేయడం వంటివి చూస్తే పెద్ద కుమార్తె వేదశ్రీ స్పృహాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మృతదేహాలపై కత్తి గాట్లు..రాజేశ్వరీ ఎడమ చేయి మణికట్టు, పాదాల వద్ద కత్తిగాయాలు ఉండగా, వేద సాయిశ్రీ గొంతును పదునైన కత్తితో కోసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యగానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు నేతృత్వంలో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే మృతుల ఇంట్లో ఓ లేఖ లభ్యమైనట్లు ప్రచారం జరుగుతుండగా పోలీసులు మాత్రం దానిని ధ్రువీకరించడం లేదు. మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ మోతీరాం పర్యవేక్షణలో తల్లి, కుమార్తె మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతిఅన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ తల్లి, కుమార్తె మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు తెలిపారు. మూడు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మృతుల శరీరాలపై కత్తిగాట్లు ఉన్నందున పోస్టుమార్టం నివేదిక తర్వాత క్లూస్టీం సమాచారం మేరకు లోతైన విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. -
ఆ ధైర్యసాహసాలకు సలాం కొట్టాల్సిందే (ఫొటోలు)
-
నువ్వులేని ఈ జీవితం మాకెందుకయ్యా...
ఎట్టా పోతివిరా బిడ్డా ప్రతాపా మీ నాయనలాగే మమ్మల్ని వదలి అట్టెట్టా పోతివిరా ఇంట్లో దీపం వెలిగినా... అంతా చీకటేనయ్యామా జీవితాలు అంధకారమం అయ్యయయ్యా జాలిచూపే మనుషులు ఇక్కడ లేరయ్యా నీకేమైందో... ఎందుకు ఎళ్లిపోయావో ఎలా చెప్పేదయ్యా...నువ్వుంటే ధైర్యంగా ఉండేదయ్యా మా జీవితమే నువ్వైనప్పుడు... నువ్వులేని ఈ జీవితం మాకెందుకయ్యా వస్తున్నా...చెల్లితో కలిసి నేనూ వస్తున్నా బిడ్డా... ....అంటూ ఓ తల్లి ఇటీవల మృత్యువాత పడిన కుమారుడిని తలచుకుని కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. శ్రీ సత్యసాయి: కుమారుడి మృతి జీర్ణించుకోలేక తల్లి కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తల్లి మృత్యువాత పడగా, కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మండల పరిధిలోని ఇందుకూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... గంగిరెడ్డి, వెంకటలక్ష్మమ్మ(55) దంపతులు. వీరికి ప్రతాప్రెడ్డి, పుష్పావతి సంతానం. గంగిరెడ్డి కొన్నేళ్ల క్రితమే మృత్యువాత పడగా, వెంకట లక్ష్మమ్మ కూతురు, కుమారుడే లోకంగా బతికింది. అయితే వారం రోజుల క్రితం కుమారుడు ప్రతాప్రెడ్డి స్నేహితులతో కలిసి మద్యం సేవించి అనుమానాస్పదరీతిలో మృతి చెందాడు. ఆధారం అనుకున్న ఒక్కగానొక్క కుమారుడు దూరం కావడాన్ని వెంకటలక్ష్మమ్మ జీర్ణించుకోలేక పోయింది. ఈ క్రమంలోనే మంగళవారం ఆమె కూతురు పుష్పావతితో కలిసి ఊజిమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన ఇరుగూ పొరుగు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, వెంకటలక్ష్మమ్మ మృత్యువాత పడింది. కూతురు పుష్పావతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బోయిన్పల్లిలో తీవ్ర విషాదం.. కుటుంబం ఆత్మహత్య!
సాక్షి, హైదరాబాద్: బోయినపల్లి ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచి.. పోస్టుమార్టం తర్వాత మృతదేహాల్ని స్వస్థలానికి పంపించినట్లు సమాచారం. తూర్పు గోదావరికి చెందిన విజయలక్ష్మీ భర్త, తన ఇద్దరు కూతుళ్లతో బోయినపల్లిలోని భవానీపురంలో నివసిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే ఆమె భర్త చనిపోగా.. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆ బాధలో కూతుళ్లు చంద్రకళ, దివ్యాంగురాలైన మరో కూతురు సౌజన్య పాలు పంచుకున్నారు. అంతా కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారే ఏమో పాపం.. వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రకళ ఎంబీఏ చదువుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదీ చదవండి: కాపీ కొడుతూ దొరికిన దీపిక!.. అందుకే సూసైడ్ చేసుకుందా? -
ఏలూరు జిల్లాలో దారుణం.. నిద్రిస్తున్న తల్లీ కూతుర్ని కిరాతకంగా..
సాక్షి, ఏలూరు: జిల్లాలోని ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామం హరిజనవాడ ఎన్టీఆర్ కాలనీలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీ కూతురును దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మృతులను సొంగా జేసు మరియమ్మ(33), సొంగా అఖిల (14) గా గుర్తించారు. సీఐ అంకబాబు, ముసునూరు ఎస్సై కుటుంబరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరియమ్మ భర్త నుంచి ఐదు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుంది. కూతురితో కలిసి జీవిస్తోంది. మీర్జాపురానికి చెందిన వ్యక్తితో మరియమ్మ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. చదవండి: ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురి మృతి! -
మాటేశారు... కాటేశారు
పచ్చటి ఆకులపై తుషార బిందువులు... దేవుడికి అభిషేకం చేశాక భూమి మీద రాలిపడ్డ ముత్యాలు... అలాంటి పచ్చటి అమాయక నిష్కల్మష కొండలలో విషపు కోరికలతో తోడేళ్లు మాటేశాయి... కాటేశాయి... అమాయకత్వానికి మూఢనమ్మకానికి పీటముడి వేసి కాల్చేశాయి. మూఢనమ్మకం వాడుకలో ఉందని తెలుసుకాని వాడుకోవడానికి ఉందని ఈ కథనం తెలుపుతోంది... ‘అటెళ్లకు తోడేళ్లుంటాయ్’ అన్నాడు ఎర్రోడు. ‘నువ్వున్నావుగా. ఎర్ర తోడేలువి. ఇంకా అడవిలో తోడేళ్లెక్కడివి?’ అని గట్టిగా అంటించింది ముత్తి. పక్కన ఉన్న స్నేహితురాలు కిసుక్కున నవ్వింది. ఇద్దరూ కలిసి కట్టెలకు వెళుతున్నారు. ఎర్రోడు ప్రతిసారీ వెంట పడుతున్నాడు. అడవిలో పూలైనా సరే ఎవరో ఒకరి కంట పడతాయి. ముత్తి పదహారేళ్ల పువ్వు. ఎర్రోడి కన్ను ఇప్పుడా పువ్వు మీద ఉంది. అరకు ప్రాంతంలో ఒక చిన్న పల్లె అది. చెట్టు, చేమలతో నిండిన పచ్చటి ప్రదేశం. బుడ్డి దీపాలే వారికి వెలుగు దివ్వెలు. కాఫీ తోటల్లో పనే అక్కడివారికి జీవనాధారం. బయటి ప్రపంచంతో వేరే సంబంధమే ఉండని ప్రాంతం. పగలంతా కష్టం. రాత్రయితే ఆటా పాటా... ముత్తి చాలా చక్కగా పాడుతుంది. అచ్చు మీ అమ్మలాగే పాడుతావు అంటారు అందరూ. ముత్తి తల్లి హంస కూడా మంచి గాయని. మగదిక్కు లేని ఇంటినీ ఒక్కగానొక్క కూతురిని చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ నిర్వహించుకుంటూ వస్తోందామె. కూతురి మనువు ఒక్కటే ఆమెకు బెంగ. ఈలోపు ఏ తోడేలూ ముట్టకుండా కూడా జాగ్రత్త పడాలి. అందుకే కూతురి మీద ఒక కన్నేసి పెడుతోంది. ఎర్రోడు వెంట పడుతున్నాడని తెలుసు. అతనికి ఎలా బుద్ధి చెప్పాలి? ‘ఏమైంది నీ ప్రయత్నం పిట్టను కొట్టావా?’ అడిగాడు కొమ్మోడు ఎర్రోణ్ణి. ‘అవుతుంది అవుతుంది’ అన్నాడు ఎర్రోడు. ‘నీ ముఖంలే’ అని నవ్వాడు కొమ్మోడు. ఎర్రోడి ప్రయత్నం కొమ్మోడికి తెలుసు. ఇంకా వాడి ఇద్దరు ముగ్గురు స్నేహితులకు తెలుసు. మొదట ఎర్రోడు సాధిస్తే తర్వాత తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఉన్నారు వాళ్లు. అప్పుడే అటుగా హంస వచ్చింది. ‘సూడండయ్యా.. ఊరికే నా కూతురి వెంటపడి మా బతుకు బజారను పడేయకండి. మీకు దండం ఉంటుంది. నా మాట వింటే సరే. లేదంటే మీ సంగతి ఊరి పెద్దల ముందు పెడతాను’ మంచిగానే వాళ్లకు హెచ్చరిక చేసింది హంస. మిత్రులందరూ ఆమె వైపు కోపంగా చూశారు. కాని ఊరి పెద్దలు అటుగా వస్తుండటంతో మాట మాట్లాడలేదు. వారం రోజులు గడిచాయి. ఊళ్లోని ముసలయ్యా అర్ధరాత్రి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ప్రాణాలు విడిచాడు. అలా ఒక మనిషి హటాత్తుగా చచ్చిపోవడంతో ఊరంతా ఆందోళనగా గుమిగూడింది. ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేశారు. అప్పటికే హాయిగా స్వేచ్ఛగా బతికే హంస మీద, ముత్తి మీద ఊరి ఆడవాళ్లకు అసూయ ఉంది. మరుసటిరోజు కాఫీ తోటల్లో సంభాషణ ఇలా సాగింది: ‘హంస పనికి ఒకరోజొస్తే ఒకరోజు రావట్లేదు. డబ్బెక్కువైందో ఏంటో’ కాఫీ గింజలు ఒలుస్తూ అంది ఒకామె. ‘‘ఈ మధ్య తల్లీకూతుళ్లు ఎవరితోనూ కలవడం లేదు. ఎటెళ్తున్నారో ఏంటో. ఇంకేదైనా పనులకు పోతున్నారేమో’’ సమాధానంతోపాటు సందేహాన్ని కూడా ఒలికించింది మరొకామె.. ‘ఇద్దరూ చేతబడి చేస్తున్నార్ట. రాత్రి పూట ఊరంతా తిరుగుతున్నారట. కుర్రాళ్లంతా అదే మాట అంటున్నారు’ తాను విన్నవీ, తనకు తోచినవీ కలిపి వంతపాడింది మరొకామె. ‘‘అయినా హంస ఎక్కడికెళ్లినా అడగడానికి మొగుడు లేడు, అడ్డుచెప్పేవాళ్లు లేకపోతే ఏ ఆటైనా ఆడవచ్చు’ తన మనసులోని అసూయనంతా ఒలకబోసింది మరొకామె. ‘అరే! ఇది విన్నారా! ముసలయ్యను హంసే చంపేసిందట. చేతబడి చేసింది. అందుకే ఏ పసరు వేసినా నయం కాక పైకి పోయాడు’ యథాలాపంగా అన్నట్లు అన్నాడు ఎర్రోడు. మిగిలిన కుర్రాళ్లు నిజమే కావచ్చు అన్నట్లు ముఖం పెట్టారు. ఈ మాటలన్నీ తల్లీకూతుళ్ల చెవిన కూడా పడుతున్నాయి. కూతురి భద్రతను మరింత కట్టుదిట్టం చేసుకుంటోంది హంస. అంతలో ఓ రోజు... ఊరంతా హంస ఇంటి నుంచి కేకలు వింది. రాత్రికి రాత్రి హంసని, ముత్తిని చంపేశారు. వారి గుడిసెలోనే చంపేశారు. మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి తగులబెట్టేశారు. ప్రాణభయంతో అరిచిన అరుపులకు ఊరు మేల్కొంది. కొన ఊపిరితో మంటల్లో కాలుతున్న వారిని అందరూ చూస్తున్నారు, కానీ కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. తెల్లవారింది. హంస ఇంటి ముందు ఊరి పెద్ద నులకమంచం మీద కూర్చుని ఉన్నాడు. ఈ పని చేసిందెవరంటే అందరూ అందరి వైపూ చూసుకుంటున్నారు. ఎవరూ ఎవరినీ వేలెత్తి చూపించట్లేదు. ఎర్రోనితోపాటు అతడి స్నేహబృందం ఓ పక్కగా నిలబడి ఉంది. ఎవరిలోనూ తప్పు చేసిన భావన లేదు. విచారణను మరుసటి రోజుకి వాయిదా వేశాడు పెద్ద. ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. మరుసటిరోజు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. ఇంటింటికీ వెళ్లి తలుపుకొడుతున్నారు. బయటకు వచ్చిన వాళ్లు పోలీసుల ప్రశ్నలకు తమకు తోచినది చెప్పి తప్పించుకుంటున్నారు. ఇరవై ఇళ్ల వాళ్లతో మాట్లాడేటప్పటికి పోలీస్కి ఓ పిక్చర్ వచ్చింది. ఇక ఊహాజనితమైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సాయంత్రానికి ఎర్రోడి బ్యాచ్ని అదుపులోకి తీసుకున్నారు. చేతబడులు, క్షుద్రపూజలు ఉండవని, ఒకవేళ ఎవరైనా అలాంటి పూజలు చేసినా వాటి వల్ల ఎవరికీ నష్టం జరగదని నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అదెవరికీ నచ్చడం లేదని పది నిమిషాల్లోనే అర్థమైంది. కొండ వాలులో చెట్టు ఊగితే దెయ్యం జడలు విప్పిందని భయపడే అమాయకత్వం వారిది. అదే అమాయకత్వంలో పెరిగి పెద్దయిన వారిలో అజ్ఞానం కూడా స్థిరంగా నాటుకుపోయి ఉంది. వారిని సమాధానపరచడం కంటే మాట కటువుతో దారిలోకి తేవడమే తమకు చేతనైన పని అనుకున్నారు. అదే ఫార్ములాను ఆచరణలో పెట్టడంతోపాటు సామాజిక కార్యకర్తల చేత సమావేశం ఏర్పాటు చేసి చెప్పించారు. (గమనిక: గోప్యతకోసం ఊరూ, పేర్లూ మార్చాం) ఎందుకు చంపేశారు! హంస చేతబడి చేయడం లేదని, చేతబడి ముద్ర ఆమె మీద మోపారని ఎర్రోడు బృందానికి తెలుసు. ముత్తి మీద కన్నేసిన ఎర్రోడు తల్లీకూతుళ్లను ఎన్ని రకాలుగా వేధించాడో స్నేహబృందంలో అందరికీ తెలుసు. కడుపులో అల్సర్తో చనిపోయిన ముసలయ్య మరణాన్ని సాకుగా తీసుకుని, ఆ రాత్రి ఇంట్లో దూరి తల్లీకూతుళ్ల మీద అఘాయిత్యానికి పాల్పడిన సంగతిని ఇద్దరు కుర్రాళ్లు బయటపెట్టారు. అఘాయిత్యంతో ఆగిపోతే ఊరి ముందు నేరగాళ్లుగా తలదించుకోవాలి. కనుక ఏం జరిగిందో చెప్పడానికి వాళ్లు ఉండకూడదు. అందుకే వారిని మంటలకు ఆహుతి చేశారు. కుక్కను చంపాలంటే దానిని పిచ్చికుక్క అని నమ్మించాలి. అలాగే లైంగిక నేరాలకు పాల్పడే వాళ్లు మహిళల మీద అసాంఘిక శక్తి, క్షుద్రశక్తులను సాధన చేస్తోంది... అనే ముద్ర వేయడం ఆదివాసీ గ్రామాల్లో సర్వసాధారణమైపోయింది. ఆ ముసుగులో ఏం చేసినా ఊరి మద్దతు ఉంటుంది. - పోలీస్ అధికారి -
నదిలో తల్లీకూతుళ్ల మృతదేహాలు
⇒ 20న అదృశ్యమై.. నదిలో శవాల్లా తేలారు.. ⇒ అనారోగ్యమే కారణం అంటున్న బంధువులు ⇒ కూతురు మృతిపై అనుమానాలు ⇒ ప్రమాదవశాత్తూ మరో వృద్ధురాలి మృతి ⇒ మృతులంతా విజయవాడ వాసులు తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం కృష్ణా రైల్వే బ్రిడ్జి దిగువన కృష్ణానదిలో గురువారం ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతదేహాలు కలకలం రేపాయి. రైల్వే బ్రిడ్జి కింది భాగంలో 7వ ఖానా వద్ద ఒక మహిళ, ఒక బాలిక మృతదేహాలను మత్య్సకారులు గుర్తించారు. అలాగే ఆంజనేయస్వామి దేవాలయం పుష్కరఘాట్ కింద భాగంలో నీటిలో తేలాడుతున్న వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులని పోలీసులు తొలుత భావించారు. తాడేపల్లి సీఐ ఘటనా స్థలానికి చేరుకుని మూడు మృతదేహాల వీడియో క్లిప్పింగ్లను విజయవాడ పోలీసులకు పంపారు. సమాచారం అందుకున్న విజయవాడ అజిత్సింగ్నగర్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిన రెండు మృతదేహాలు విజయవాడ అయోధ్యనగర్లో ఈ నెల 20న అదృశ్యమైన మహిళ మంత్రి ఈశ్వరమ్మ (33) ఆమె కుమార్తె రాధ(11)విగా గుర్తించారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్యనగర్ రైల్వే గేటు పక్కన సూర్యకాలనీకి చెందిన మంత్రి ఈశ్వరమ్మ భర్త అప్పలనాయుడు 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటినుంచి అదే ప్రాంతంలో పాచి పని చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడిని కొంతకాలం కిందట ఊర్మిళానగర్లో బంధువుల ఇంటి వద్ద ఉంచింది. కుమార్తెను ఆమె దగ్గరే ఉంచుకుని స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. ఏం జరిగిందో తెలియదు గానీ, 20వ తేదీ ఉదయం ఇంట్లో నుంచి వచ్చిన తల్లీకూతుళ్లు కృష్ణానదిలో శవమై కన్పించారంటూ ఈశ్వరమ్మ మరిది రామారావు పోలీసులకు తెలిపారు. ఆమెకు ఆరోగ్యం సరిగాలేదని యుక్తవయస్సు వచ్చిన ఆడపిల్లతో ఎలా బతకాలి అని ఆలోచించి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని బంధువులు చెబుతున్నారు. కుమార్తె మృతిపై అనుమానాలు? అయితే కుమార్తె రాధిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక నాలుక బైటకు వచ్చి పల్లతో నొక్కబడి ఉంది. సహజంగా ఉరి వేసుకున్నప్పుడో, గొంతు నులిమి చంపినప్పుడో మాత్రమే ఇలా నాలుక బైటకు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. బహుశా తల్లి ఈశ్వరమ్మ కూతురు రాధికను గొంతు నులిమి కృష్ణా నదిలోకి పడేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక ఎవరైనా తల్లిని ముందు నదిలో తోసి కుమార్తె గొంతు నులిమి హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో ఘటనలో వృద్ధురాలు.. ఆంజనేయస్వామి గుడి ఎదురు పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో లభించిన వృద్ధురాలి మృతదేహం విజయవాడ గాంధీనగర్కు చెందిన మాసెట్టి స్వరాజ్యలక్ష్మి (85)గా పోలీసులు గుర్తించారు. బుధవారం ఉదయం గుడి కి అని చెప్పి ఇంటినుంచి తిరిగి రాలేదని కొడుకు కోటేశ్వరరావు తెలిపారు. వెతుకుతుండగా నదిలోమునిగి మృతి చెందినట్లు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. తన తల్లికి గత కొద్దికాలంగా మతిస్థిమితం సరిగా లేదని గుడికి వెళ్లేముందు కృష్ణానదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతి చెంది ఉంటుందని ఆయన చెప్పాడు. -
రైలు కిందపడి కూతురు సహా తల్లి ఆత్మహత్య
- ఘట్కేసర రైల్వేస్టేషన్కు సమీపంలో ఘటన - మృతులు హైదరాబాద్ వాసులు ఘట్కేసర్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర రైల్వేస్టేషన్కు సమీపంలో సోమవారం రైలు కిందపడి కూతురితో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసుల కథనంప్రకారం.. హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన స్వప్న(25)కు కూతురు శాన్వీ(3), కుమారుడు శ్యాం ఉన్నారు. సోమవారం స్వప్న తన కూతురితో కలిసి ఇంట్లోంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబీకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, సాయంత్రం ఘట్కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల వద్ద రైల్వే ట్రాక్పై తల్లీకూతురు విగతజీవులుగా పడిఉన్నారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ జీపీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.