స్థల వివాదం: ముగ్గురు దారుణ హత్య
ముంబై : స్థల వివాదం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీద్ జిల్లాలోని కేజ్ తెహ్సిల్ గ్రామానికి చెందిన బాబు పవర్ కుటుంబానికి అదే ప్రాంతానికి చెందిన మరో కుటుంబంతో గత కొన్ని సంత్సరాలుగా స్థల వివాదం నడుస్తోంది. స్థల వివాదానికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పవర్ కుటుంబంపై ప్రత్యర్థులు దాడి చేశారు. బాబు పవర్తో పాటు, ప్రకాశ్ బాబు పవర్, సంజయ్ బాబు పవర్లను కత్తులతో నరికి చంపారు. అంతటితో ఆగకుండా ఇంట్లోని వస్తువులను సైతం కాల్చి బూడిద చేశారు. ఘటనలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యలతో సంబంధం ఉన్న 12మందిని అదుపులోకి తీసుకున్నారు.