కీర్తి దిండు పెట్టగా.. శశి గొంతు నులిమాడు

Keerthi Kills Mother: BalReddy Harassed Keerthi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హయత్‌నగర్‌లో కన్నతల్లినే కూతురు హత్య చేసిన కేసులో ట్విస్టుల పరంపర కొనసాగుతోంది. ప్రియుడు శశికుమార్‌తో కలిసి కీర్తి.. తన తల్లి రజితను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు సంబంధించి పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రజితను హత్య చేసినట్టు అంగీకరించిన శశికుమార్‌, కీర్తిలు.. హత్యకు ముందు జరిగిన విషయాలను వెల్లడించారు. 19వ తేదీన రజిత ఇంటి నుంచి కూరగాయల మార్కెట్‌కు వెళ్లింది. రజిత మార్కెట్‌ నుంచి తిరిగి వచ్చే సరికి ఇంట్లో కీర్తి, శశికుమార్‌లు ఇద్దరు కలిసి ఉన్నారు. దీంతో ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఈ గొడవ అనంతరం.. రజితను అడ్డు తొలగించికుంటేనే ఇద్దరం కలిసి ఉంటామని శశికుమార్‌ కీర్తిని  ఒప్పించాడు. కీర్తి ఇంటికి బీర్‌ బాటిల్స్‌ తీసుకువచ్చాడు. రజిత లోపల గదిలో ఉండగా.. శశికుమార్‌, కీర్తిలు కలసి ఇంటి ఆవరణలోనే మద్యం సేవించారు. ఆ తర్వాత వారిద్దరు ఇంటి లోపలకు వెళ్లి.. లోపలి నుంచి లాక్‌ చేశారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం.. రజిత అరవకుండా కీర్తి ఆమె మొహంపై దిండు పెట్టింది. అదే సమయంలో శశికుమార్‌ చున్నీతో రజిత గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత వారిద్దరు రజిత మృతదేహాన్ని యాదాద్రి జిల్లా రామన్నపేట రైల్వేగేటు వద్ద పడవేశారు. 

కీర్తి మొదటి ప్రియుడు బాల్‌రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు నిర్దారణ అయింది. దీంతో పోలీసులు బాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు కీర్తిపై బాల్‌రెడ్డి అత్యాచారం చేయగా.. మరో ప్రియుడు శశికుమార్‌ ఆమెకు అబార్షన్‌ చేయించాడు. దీంతో ఆమె బాల్‌రెడ్డికి దూరమై.. శశికుమార్‌కు దగ్గర అయినట్టుగా తెలిసింది. కాగా, ఈ హత్యకేసు వెలుగులోకి రావడంతో శశికుమార్‌, బాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అలాగే సెల్‌ఫోన్లలోని వీడియోలు, వాట్సాప్‌ చాటింగ్, కాల్‌డేటా ఆధారంగా కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ హత్య కేసులో బాల్‌రెడ్డి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కాగా, శశికుమార్‌తో కలిసి తల్లిని అంతమొందించిన కీర్తి.. ఆ నెపాన్ని తండ్రి శ్రీనివాస్‌రెడ్డిపై వేసేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. వైజాగ్‌ టూర్‌ వెళ్లానని చెప్పిన కీర్తి.. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో కీర్తి ప్రవర్తనపై శ్రీనివాస్‌రెడ్డికి అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా కీర్తి నేరం చేసినట్లు ఒప్పుకుంది. 

చదవండి : తల్లిని చంపిన కీర్తి కేసులో మరో ట్విస్ట్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top