కుటుంబంతో సహా బీజేపీ నాయకుడి దారుణ హత్య
రాంచీ : బీజేపీ నాయకుడు, అతని కుటుంబ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన జార్ఖండ్లోని ఖుంతి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. బీజేపీ నాయకుడు మాగో ముండా సోమవారం రాత్రి ఇంటి దగ్గర కుటుంబంతో కలిసి కూర్చొని ఉండగా గుర్తు తెలియని దుండగులు వచ్చి వారిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మాగో, అతని భార్య లక్మణి, కొడుకు లిప్రాయి అక్కడిక్కడే మరణించారని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో మరో మహిళ తీవ్రంగా గాయపడటంతో ఆమెను రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు తరలించామని తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు వెల్లడించారు.