చదువులో రాణించడమే ఆ బాలికకు శాపం
లక్నో : ఉత్తర్ ప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చదువులో బాగా రాణిస్తున్నదనే అసూయతో వరుసకు సోదరిపై నలుగురు సోదరులు ప్రభుత్వ పాఠశాలలోనే లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని సీతాపూర్లో వెలుగుచూసింది. ఈ వికృత చర్యలో నిందితులతో ఓ ఉపాధ్యాయుడు కూడా పాలుపంచుకోవడం కలకలం రేపింది. బాలికపై లైంగిక దాడి దృశ్యాలను నిందితులతో పాటు టీచర్ మొబైల్ ఫోన్లో రికార్డు చేసి కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడంతో ఈ ఉన్మాద చర్య బయటపడింది.
లైంగిక దాడికి గురైన ఎనిమిదవ తరగతి చదివే 16 ఏళ్ల బాలిక తన తల్లితండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. బాలికకు మత్తుమందు తాగించి నలుగురు సోదరులతో పాటు టీచర్ బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి, ఆమె స్పృహలోకి రాగానే ప్లే గ్రౌండ్లో కళ్లుతిరిగి పడిపోవడంతో ఇక్కడకు తీసుకువచ్చామని నమ్మబలికారని పోలీసులు చెప్పారు. చదువులో ముందున్నాననే అసూయతో సోదరులు నలుగురు తనపై ఈ ఘోరానికి పాల్పడ్డారని బాలిక తన ఫిర్యాదులో పేర్కొందని ఏఎస్పీ మధువన్ కుమార్ సింగ్ చెప్పారు.