కలచివేసిన రోడ్డు ప్రమాదం

Horrible Road Accident In Tadepalli Mandal Nulakapeta - Sakshi

సాక్షి, గుంటూరు : మితిమీరిన వేగం అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. అతివేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతిచెందారు. ఈ హృదయ విదారక ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నులకపేట వద్ద చోటుచేసుకుంది. దంపతులతో సహా మూడేళ్ల చిన్నారి దుర్మరణం పాలయింది. మృతులు తాడేపల్లికి చెందిన శ్రీకాంత్‌, సరిత, అక్షరగా గుర్తించారు.  మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన తీరు, మృతుల్లో దంపతులతో పాటు మూడేళ్ల పాప ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. బంధువులను రైల్వేస్టేషన్‌లో దింపిరావడానికి వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ఇసుక లారీల వేగంపై గతంలో అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు స్పందించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరుచూ చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు సమీక్షలు నిర్వహించినప్పటికి.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కన్పించడం లేదు. ఈ ఘటన పై ఆగ్రహించిన బాధితుల బంధువులు మంగళగిరి - విజయవాడ  జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top