
ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన కారు
వారందరూ బీడీలు చుట్టి జీవనం సాగించే కార్మికులు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటే శ్వరస్వామిని దర్శించుకోవాలనుకున్నారు. బంధుమిత్రులందరూ కలసి కారు మాట్లాడుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. స్వామి సన్నిధికి చేరకనే మృత్యు ఒడికి చేరారు. ఈ హృదయ విదారక ఘటన బంగారుపాళెం మండలం మాధవనగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
బంగారుపాళెం: కేరళ రాష్ట్రం కాసరగూడ జిల్లా మంజేశ్వర తాలూకా మధ ర గ్రామానికి చెందిన ఫకీర్గట్టి కుటుంబ సభ్యులు, కుంబ్లె గ్రామానికి చెందిన వారి బంధువులు 10 మంది కారులో శనివా రం మధ్యాహ్నం మహేంద్ర జైలో కారు(కెఎల్14 కే7468)లో మధిరగ్రామం నుంచి తిరుమలకు బయలుదేరారు. ఆదివా రం తెల్లవారుజామున 3.40 గంటలకు బంగారుపాళెం మండలం మాదిగోనితోపు వద్ద ముందుపోతున్న కంటైనర్ వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ప్రయివే టు ట్రావెల్స్కు చెందిన బస్సు(పీవై01 ఆర్ఎస్1825)ను ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న ఫకీర్గట్టి(75), మంజప్పగట్టి(55), ఆయన భార్య గిరిజ(47), సదాశివగట్టి(50) ఘటనా స్థలంలోనే మృతి చెందారు.
నాగవేణి(49), బోజాగట్టి(58), హరీష్(35), లక్ష్మి(55), కారు డ్రైవర్ ఉమేష్(43) మాధవ(47) గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నెట్టి కంఠయ్య, హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో నాగవేణి, బోజాగట్టి, హరీష్, లక్ష్మిని మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ ఉమేష్, మాధవకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డీఎస్పీ చౌడేశ్వరి, గంగవరం సీఐ మధుసూదన్రావు ఘట న స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను బస్సు, కారు డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. ముందుపోతున్న కంటైనర్ను అధిగమించే క్రమంలో కారు, ఎదురుగా వేగంగా వస్తున్న బస్సు ఢీకొనడంతో ఈ ఘోరం జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు చర్యలు..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత స్వగ్రామాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు. మృతదేహాలను తరలించేం దుకు అంబులెన్స్ను సిద్ధం చేసినట్లు చెప్పారు.