కన్న కొడుకును కడతేర్చిన తండ్రి

father murdered his son - Sakshi

 చీరాలరూరల్‌: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తనయుడిని కత్తితో కసితీరా పొడిచి కడతేర్చాడు. ఈ సంఘటన మండల పరిధిలోని జాండ్రపేటలో సోమవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. జాండ్రపేటలోని నేతాజీ నగర్‌కు చెందిన షేక్‌ బుజ్జి, మస్తానీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలున్నారు. బుజ్జి మటన్‌ దుకాణం నడుపుతుంటాడు. అతడు నిత్యం మద్యం తాగి కుటుంబంలో గొడవలు పడుతుంటాడు. ఈ క్రమంలో అతడు మధ్యాహ్నం సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తూ పడుకునేందుకు మంచం వేసుకుంటున్నాడు.

బుజ్జి ఆఖరి కుమారుడు బాబి (19) అన్నం తింటున్నాడు. మంచం వేస్తే నడిచేందుకు అడ్డుగా ఉంటుందని, అన్నం తిన్న తర్వాత మంచం వేసుకోవాలని బాబి తన తండ్రి బుజ్జికి సూచించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన బుజ్జి.. తన కుమారుడు బాబి పొట్టలో కసితీరా కత్తితో పొడిచాడు. చివరకు కుమారుడి పొట్టలోని పేగులు సైతం బయటపడ్డాయి. గమనించిన కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని చికిత్స కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. 

అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాబి మృతి చెందాడు. మృతుడు టైలర్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒన్‌టౌన్‌ సీఐ వి.సూర్యనారాయణ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top