‘పాపా’గ్ని ఒడిలో..! | Father Killed Three Months Baby Girl in YSR Kadapa | Sakshi
Sakshi News home page

‘పాపా’గ్ని ఒడిలో..!

Jan 6 2020 11:43 AM | Updated on Jan 6 2020 11:43 AM

Father Killed Three Months Baby Girl in YSR Kadapa - Sakshi

మూడు నెలల పాప..కమ్మని పాలు తాగుతూ..కన్నతల్లి వెచ్చని ఒడిలోకంటి నిండా నిద్రపోవాలి..కానీ..కసాయి తండ్రి కర్కోటకానికి  బలైపోయింది..  అమ్మ ఒడికి దూరమైంది..పాపాగ్ని నదిలో కలసిపోయింది..భార్యపై ప్రేమను మరిచి..అనుమాన భూతాన్నిపెంచుకుని..కన్నబిడ్డను కంటిపాపలాచూసుకోవాల్సిన  బాధ్యత వీడి..నిండు నూరేళ్ల జీవితాన్నిచిదిమేసిన కిరాతకుడి చర్య ఇది..ఆ కన్నతల్లికి కడుపుకోత మిగిల్చినసంఘటన ఇది..వేంపల్లె మండలంలో ఆదివారంవెలుగు చూసిన ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంట తడిపెట్టించింది..

వైఎస్‌ఆర్‌ జిల్లా,వేంపల్లె : భార్యపై అనుమానంతో కన్న కూతురు అని కూడా చూడకుండానే 3 నెలల పసికందును గొంతు నులిమి చంపాడు ఓ కసాయి తండ్రి. ఈ దారుణం వేంపల్లెలోని రాజీవ్‌ కాలనీలో వెలుగు చూసింది. వేంపల్లె అర్బన్‌ సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలాఉన్నాయి. వేంపల్లె మండలం నందిపల్లె గ్రామానికి చెందిన కుసీద అనే మహిళకు, అదే గ్రామానికి చెందిన తమ బంధువుల వ్యక్తి మునీంద్రతో 8ఏళ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతులకు 7ఏళ్ల కుమారుడు రాజకుళ్లాయప్ప ఉన్నాడు. ఆరేళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు జరిగి విడాకులు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం కుసీద అదే గ్రామంలో ఉన్న మల్లేల గజేంద్రను ప్రేమించి రెండో వివాహం చేసుకుంది. వీరిరువురు మొదటి భర్త కుమారుడు రాజకుళ్లాయప్పతో కలసి వేంపల్లె రాజీవ్‌ కాలనీలో నివాసముంటున్నారు. గజేంద్ర వేంపల్లె పట్టణంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా వీరికి మూడు నెలల క్రితం కుమార్తె జన్మించింది. ఈ నేపథ్యంలో గజేంద్రకు భార్యపై అనుమానం పెరిగింది. ఈ బిడ్డ తనకు పుట్టలేదనే అనుమానం రోజురోజుకు బలపడింది. అనుమానం పెనుభూతమై ఈనెల 3న శుక్రవారం సాయంత్రం తన 3 నెలల కుమార్తెను ఇంటినుంచి తీసుకెళ్లి గొంతు నులిమి చంపి వేంపల్లె పాపాఘ్ని నదిలో పూడ్చిపెట్టాడు. భార్య కుసీద శనివారం తన బిడ్డ కనిపించలేదని వేంపల్లె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  భర్త గజేంద్ర, కుమార్తె  కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు ఆదివారం గజేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా తన కూతురిని తానే చంపానని అంగీకరించాడు.  పాపాఘ్ని నదిలో పూడ్చిన పాప మృతదేహాన్ని  వేంపల్లె తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో పోలీసులు వెలికితీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement