వెంటాడిన మృత్యువు | Sakshi
Sakshi News home page

వెంటాడిన మృత్యువు

Published Mon, Feb 10 2020 1:07 PM

Family Injured in Road Accident Karnataka - Sakshi

శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్‌: కర్ణాటకలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట నవభారత్‌నగర్‌ కాలనీకి చెందిన కింతలి భుజంగరావు (40) మృతి చెందారు. ఈయన బళ్లారిలోని స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమలో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీ పనిమీద తోటి ఉద్యోగులతో కలిసి కారులో వెళ్తుండగా  విజయపుర(బిజాపుర) జిల్లా నిడగుంది తాలూకా గూలసంగి గ్రామ సమీపంలో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భుజంగరావుతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరు గాయపడ్డారు.  మృతుల్లో ఒకరైన యేసుదాస గోక్యాడ(30) కూడా ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్లు వాహనాన్ని వదిలి పరారయ్యారు. ఈ ప్రమాదంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్థానికులు రోడ్లపై టైర్లకు నిప్పంటించి నిరసనకు దిగారు. ప్రమాద నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

నవభారత్‌నగర్‌ కాలనీలో విషాదం..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భుజంగరావుకు భార్య హైమ, కుమారుడు నిఖిల్, కుమార్తె దీక్షిత ఉన్నారు. మృతుని తండ్రి అప్పలరాజు వైద్య ఆరోగ్యశాఖలో కమ్యూనిటీ హెల్త్‌ అధికారిగా ఉద్యోగ విరమణ చేశారు. తల్లి రత్నం గృహిణి. ఉన్నత స్థాయిలో ఉన్న కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Advertisement
Advertisement