భువనేశ్వర్: మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాలో తాజాగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో తెలుగు మావోయిస్టు కమాండర్, ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్చార్జ్ గణేష్ మృతి చెందాడు. కాగా, గణేష్పై రూ.25 లక్షల రివార్డు కూడా ఉండటం గమనార్హం.


వివరాల ప్రకారం.. ఒడిశాలోని కందమాల్ జిల్లా బెల్ధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఈ కాల్పుల్లో రాష్ట్ర కమిటీ ఇన్చార్జ్ గణేష్ మృతి చెందాడు. కాగా, గణేష్ స్వస్థలం నల్లగొండ జిల్లాలోని పుల్లెమ్ల గ్రామం. గణేష్పై రూ.25 లక్షల రివార్డు ఉంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం గణేష్పై ఈ రివార్డు ప్రకటించింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కాగా గణేశ్ అలియాస్ హనుమంతు ఎన్కౌంటర్ను స్పెషల్ ఆపరేషన్స్ ఏడీజీపీ సందీప్ పాండా ధృవీకరించారు. కంధమల్ - గంజాం పరిధి రాంభా అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఘటనా స్థలంలో 2 ఇన్సాస్ లు, ఒక 303 రైఫిల్లను స్వాధీనం చేసుకున్నారు. 2 సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ టీంలతో కలిసి ఒరిస్సా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ 20 పోలీసు బృందాల జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. గతంలో ఛత్తీస్ ఘడ్ లో హన్మంతు పనిచేశారు. 3 ఏళ్ల క్రితం కేరళ, తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో దళాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా గణేష్ కదలికలను భద్రతా బలగాలు తెలుసుకున్నాయి. ఎస్ఓజీ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎన్కౌంటర్ జరిగింది.




