బెంగాల్లో మరో హత్య!
పురూలియా / న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో మరో వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. పురూలియా జిల్లా బలరామ్పూర్కు చెందిన దులాల్ కుమార్(35) మృతదేహం శనివారం దేవా గ్రామ సమీపంలోని ఓ విద్యుత్ హైటెన్షన్ టవర్కు వేలాడుతూ కన్పించింది. దీంతో దోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు బలరామ్పూర్ పోలీస్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
కాగా, తమ పార్టీ కార్యకర్త అయినందునే దులాల్ కుమార్ను హత్యచేశారని బీజేపీ నేతలు విమర్శించారు. నాలుగు రోజుల్లో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడంపై విచారం వ్యక్తంచేసిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. బెంగాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో మమత ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మరోవైపు ఈ రెండు హత్యలపై సీఐడీ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. పురూలియా సూపరింటెండెంట్(ఎస్పీ) జోయ్ బిశ్వాస్పై బదిలీ వేటువేసింది.