టీచరే.. కాల్చింది!    | Anganwadi Teacher Tortured To A Girl | Sakshi
Sakshi News home page

టీచరే.. కాల్చింది!   

Jun 26 2018 8:31 AM | Updated on Jun 26 2018 8:31 AM

Anganwadi Teacher Tortured To A Girl - Sakshi

తనను కాల్చింది ఈమేనని అంగన్‌వాడీ టీచర్‌ను చూపిస్తున్న వర్షిణి

బషీరాబాద్‌(తాండూరు) : నాలుగేళ్ల çపసిపాప బుగ్గలపై ఓ అంగన్‌వాడీ టీచర్‌ అగ్గిపుల్లలతో కాల్చిన అమానుష ఘటన సంచలనం రేపింది. అన్ని దిన పత్రికల్లో దీనికి సంబంధిన వార్తలు రావడాన్ని గమనించిన ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. సాయంత్రంలోపు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జగదీశ్వర్‌ వికారాబాద్‌ డీడబ్ల్యూఓను ఆదేశించించారు.

బాలికను కాల్చి హింసించిన అంగన్‌వాడీ టీచర్‌పై వెంటనే పోలీసు కేసు నమోదు చేయాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ఉదయం బషీరాబాద్‌ మండలం కంసాన్‌పల్లి(బి)కి చేరుకున్న డీడబ్ల్యూఓ జ్యోత్స్న, తాండూరు సీడీపీఓ జగదాంబ, సూపర్‌ వైజర్లు నర్సమ్మ, దశమ్మతో కూడిన విచారణ బృందం సుమారు 8 గంటల పాటు విచారణ జరిపింది.

ఇందులో అంగన్‌వాడీ టీచర్‌ సులోచన చేసిన దాష్టీకం బయటపడింది. విచారణ సమయంలో మొదట నెపాన్ని అంగన్‌వాడీ ఆయాపై నెట్టే ప్రయత్నం చేసిన ఆమె పన్నాగంబెడిసి కొట్టింది. తనను కాల్చింది టీచర్‌ సులోచనేనని బాధిత బాలిక వర్షిణి అధికారులు, గ్రామస్తుల సమక్షంలో చూపించడంతో ఒక్కసారిగా ఖంగుతింది. దీంతో పాపను అగ్గిపుల్లలతో కాల్చింది తానేనని అంగీకరించింది.

పాప తండ్రి శ్యామప్ప తనబిడ్డను భయపెట్టమని చేతులు కట్టి తనకు శనివారం రోజు అప్పగించాడని, దీంతో ఆ పాపను భయపెట్టడానికే అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇది ఇంత పెద్ద లొల్లి అవుతుందని అనుకోలేదని తెలిపింది. చేసిన తప్పునకు క్షమాపణ కోరుతున్నానని అభ్యర్థించింది. మరోవైపు అంగన్‌వాడీ టీచర్‌ సులోచనకు డీడబ్ల్యూఓ జ్యోత్స్న మెమో జారీ చేశారు.

అనంతరం బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ అందుబాటులో లేకపోవడంతో కేసు నమోదు కాలేదు. మరోవైపు ఈ ఘటనపై కలెక్టర్‌ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. విచారణ నిష్పక్షపాతంగా జరపాలని అధికారులను ఆదేశించారు.  

సస్పెండ్‌ చేయాలి...   
నాలుగేళ్ల పాప పట్ల పైశాచికంగా ప్రవర్తించిన అంగన్‌వాడీ టీచర్‌ సులోచనను వెంటనే విధుల నుంచి తొలగించి, అరెస్టు చేయాలని బాలల హక్కుల పోరాట సమితి నాయకుడు సుదర్శన్, చైల్డ్‌లైన్‌ మండల ప్రతినిధి హన్మంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

అంగన్‌వాడీ టీచర్‌పై బాలిక వర్షిణి తల్లిదండ్రులు మహంతమ్మ, శ్యామప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డను హింసించడమే కాకుండా తామే చేయించామని ఆరోపించడంపై మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement