భోపాల్: అంగన్వాడీ కేంద్రంలో ఓ గర్భిణీకి పోషకాహార లడ్డూలంటూ అందజేసిన ప్యాకెట్లో చనిపోయిన పాము పిల్ల కనిపించడం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్లోని పంధుర్నా జిల్లా కార్ఘాట్ కమ్టీ గ్రామంలో ఈ దారుణం వెలుగు చూసింది. వత్సలా బాయి ధుర్వే అనే గర్భవతి పోషకాలతో కూడిన ఆహారమంటూ లడ్డూల ప్యాకెట్ను అంగన్వాడీ సిబ్బంది అందజేశారు. ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులు ఆ ప్యాకెట్ను తెరిచి చూసి షాకయ్యారు. అందులో చనిపోయిన పాము పిల్ల ఉంది. దీంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందారు.
ఈ విషయమై వారు వెంటనే అంగన్వాడీ సిబ్బందికి, స్థానిక అధికారులకు సమాచారమిచ్చారు. విషయం తెలిసిన ఐసీడీఎస్ పీడీ ఉషా పండ్రేతోపాటు మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు ఆ గ్రామానికి చేరుకుని, వివరాలను వాకబు చేశారు. ఘటనపై విచారణకు తాత్కాలిక కలెక్టర్ అగ్రిమ్ కుమార్ ఐదుగురు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాము పిల్ల ప్రత్యక్షమైన ఆహార ప్యాకెట్ను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తాత్కాలిక కలెక్టర్ తెలిపారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు డిమాండ్ చేశారు.


