2,000 ప్రమాదాలు.. 368 మంది మృతులు | 368 Migrant woprkers Eliminate way to home in lockdown peried | Sakshi
Sakshi News home page

2,000 ప్రమాదాలు.. 368 మంది మృతులు

May 17 2020 5:13 AM | Updated on May 17 2020 5:13 AM

368 Migrant woprkers Eliminate way to home in lockdown peried - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో కేంద్రం లాక్‌డౌన్‌ విధించిన సమయంలో మార్చి 25 నుంచి మే 16వ తేదీ వరకు 2 వేల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 368 మంది మృతి చెందినట్లు తేలింది. దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్న సేవ్‌లైఫ్‌ ఫౌండేషన్‌ సంస్థ ఇందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. మొత్తం 368 మంది మృతుల్లో సొంతూళ్లకు వెళ్తున్న వలస కార్మికులు 139 మంది కాగా, అత్యవసర సేవల సిబ్బంది 27 మంది, ఇతరులు 202 మంది అని వెల్లడించింది.

‘368 మంది మృతుల్లో ఒక్క యూపీలోనే 100 మంది ఉన్నారు. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌(30), తెలంగాణ (22), మహారాష్ట్ర(19), పంజాబ్‌(17) ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నిటికీ అతి వేగమే కారణమని సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సీఈవో పీయూష్‌ తివారీ తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా రోడ్లపై ట్రాఫిక్‌ చాలా తక్కువగా ఉండటం.. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో స్వస్థలాలకు వెళ్లాలన్న ఆత్రుత వంటి కారణాలతో వాహనాలను వేగంగా నడుపుతున్నారు. దీంతోపాటు చాలా వరకు ప్రమాదాలు రాత్రి వేళల్లో, వలస జీవులు నడిచి వెళ్తుండగా లేదా నిద్రిస్తుండగా జరిగినవే’అని తెలిపారు. దేశంలో ఏటా సంభవించే 5 లక్షలకుపైగా రోడ్డు ప్రమాదాల్లో 1.50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement