అనూహ్యం : కోర్టురూమ్‌లోనే ‘అమ్రపాలి’ డైరెక్టర్లు అరెస్ట్‌  | Supreme Court Orders Arrest Of Three Directors Of Amrapali Group | Sakshi
Sakshi News home page

అనూహ్యం : కోర్టురూమ్‌లోనే ‘అమ్రపాలి’ డైరెక్టర్లు అరెస్ట్‌ 

Oct 9 2018 6:23 PM | Updated on Oct 9 2018 6:32 PM

Supreme Court Orders Arrest Of Three Directors Of Amrapali Group - Sakshi

సుప్రీంకోర్టు ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు రూమ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌ అమ్రపాలి ప్రమోటర్‌ అనిల్‌ శర్మను, డైరెక్టర్లను కోర్టు రూమ్‌లోనే అరెస్ట్‌కు జారీచేసింది సుప్రీంకోర్టు. మీ దాగుడు మూతలు ఆపాడంటూ... అమ్రపాలి గ్రూప్‌ డైరెక్టర్లపై సుప్రీంకోర్టు బెంచ్‌ మండిపడింది. వెంటనే వారిని కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, ఉదయ్‌ యూ లలిత్‌ల నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

గంట పాటు జరిగిన విచారణలో, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కోసం అమ్రపాలి గ్రూప్‌ సమర్పించాల్సిన పలు డాక్యుమెంట్లను ఇవ్వకుండా దాగుడు మూతలు ఆడుతుందని డైరెక్టర్లపై మండిపడింది. డాక్యుమెంట్లను సమర్పించకపోవడానికి పలు కారణాలను చెబుతూ తప్పించుకుంటున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గృహదారులు పెట్టుబడిగా పెట్టిన నగదును, మరో అవసరాల కోసం తరలించారా? అని కోర్టు ప్రశ్నించింది. వెంటనే శర్మకు, ఇద్దరి డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది. అన్ని డాక్యుమెంట్లు ఆడిటర్లకు సమర్పించేంత వరకు మీరు కస్టడీలోనే ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది. అది ఒక్క రోజు పట్టవచ్చు లేదా నెల అవ్వొచ్చు అని బెంచ్‌ పేర్కొంది. 

గ్రూప్‌కు సంబంధించిన పత్రాలన్నింటిన్నీ సీజ్‌ చేయాలని ఢిల్లీ పోలీసులను, నోయిడా పోలీసులను కోర్టు ఆదేశించింది. డాక్యుమెంట్లను రికవరీ చేసుకోవడానికి, ఈ ముగ్గురిని పోలీసులు ఆమ్రపాలి ఆఫీసుల చుట్టూ తిప్పాలని పేర్కొంది. అన్ని డాక్యుమెంట్లను ఆడిటర్లు పొందినట్టు తెలిశాకనే వారిని వదిలి వేయాలని బెంచ్‌ స్పష్టం చేసింది. ఈ ముగ్గురి పాస్‌పోర్టులను కూడా కోర్టు రద్దు చేసింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 24కు వాయిదా వేసింది. ఇలా నిందితులను కోర్టు రూమ్‌లోనే అరెస్ట్‌ చేయడం ఇది మూడోది. సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతా రాయ్‌ను, మరో వ్యక్తిని కూడా సుప్రీంకోర్టు, కోర్టురూమ్‌లోనే అరెస్ట్‌ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement