సౌర శక్తితో పనిచేసే కూలర్ | Solar powered cooler | Sakshi
Sakshi News home page

సౌర శక్తితో పనిచేసే కూలర్

Jul 9 2015 2:13 AM | Updated on Oct 22 2018 8:31 PM

సౌర శక్తితో పనిచేసే కూలర్ - Sakshi

సౌర శక్తితో పనిచేసే కూలర్

శీతలీకరణ ఉపకరణాల తయారీలో ఉన్న రాక్‌వెల్ ఇండస్ట్రీస్ సౌర శక్తితో పనిచేసే కూలర్‌ను రూపొందించింది.

♦ అందిస్తున్న రాక్‌వెల్   
♦ త్వరలో మిల్క్ చిల్లర్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శీతలీకరణ ఉపకరణాల తయారీలో ఉన్న రాక్‌వెల్ ఇండస్ట్రీస్ సౌర శక్తితో పనిచేసే కూలర్‌ను రూపొందించింది. కోకకోలా కోసం కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. విద్యుత్ సరఫరా సక్రమంగా లేని ప్రాంతాల్లోని మహిళలను వ్యాపారులుగా మలిచేందుకు శీతల పానీయాల విక్రయ సంస్థ కోకకోలా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా కూలర్లు సరఫరా చేస్తుంది. కోకకోలా ఒక్కో కూలర్‌కు తమకు రూ.35 వేలు చెల్లిస్తుందని రాక్‌వెల్ ఎండీ అశోక్ కుమార్ గుప్తా బుధవారం తెలిపారు.

ఇది పూర్తిగా సౌర శక్తితో పనిచేస్తుందని అన్నారు. మేడ్చల్ వద్ద కంపెనీ ఇటీవల కొత్తగా స్థాపించిన ఫ్యాక్టరీ ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ పొందిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. జర్మనీ కంపెనీ ఆర్డరు మేరకు సోలార్ ఫ్రీజర్‌ను సైతం రూపొందించామని వెల్లడించారు. భారత్‌లో సోలార్ ఆధారిత ఫ్రీజర్లు, కూలర్లను తయారు చేస్తున్న ఏకైక కంపెనీ తమదేనని గుర్తుచేశారు.

 మిల్క్ చిల్లర్ సైతం: పాడి రైతుల కోసం తక్కువ ధరలో మిల్క్ చిల్లర్‌ను మూడు నెలల్లో ప్రవేశపెడుతున్నట్టు అశోక్ కుమార్ గుప్తా చెప్పారు. పితికిన పాలను చల్లబర్చడానికి ఇవి ఉపయోగపడతాయని వివరించారు. రాక్‌వెల్‌కు మేడ్చల్ వద్ద ఇప్పటికే ఒక ప్లాంటు ఉంది. షిఫ్ట్‌కు 350 యూనిట్లు ఫ్రీజర్లు, కూలర్లు తయారు చేస్తున్నారు. కొత్త ప్లాంటును రూ.28 కోట్లతో నెలకొల్పారు. ఇక్కడ షిఫ్ట్‌కు 500 యూనిట్లు రూపొందిస్తున్నారు. ఏటా 60,000 యూనిట్లు విక్రయిస్తోంది. 2014-15లో రూ.85 కోట్ల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు ఆశిస్తోంది. ఉపకరణాలను విక్రయించేందుకు 1,000 మంది ఫ్రాంచైజీలను నియమించాలన్నది కంపెనీ ప్రణాళిక.

Advertisement
 
Advertisement
Advertisement