గణాంకాల ప్రభావంతో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు | Sensex Extends Selloff, Falls 275 Points; Nifty Below 7,850 | Sakshi
Sakshi News home page

గణాంకాల ప్రభావంతో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

May 13 2016 10:33 AM | Updated on Jul 11 2019 8:56 PM

బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్ లో అమ్మకాల పర్వం కొనసాగుతుండడంతో, దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి.

ముంబై :  శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 222.07 పాయింట్ల నష్టంతో 25,568 దగ్గర,  నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో 7,850 దగ్గర ట్రేడవుతోంది. ముఖ్యంగా  బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్ లో అమ్మకాల పర్వం కొనసాగుతుండడంతో, మిగిలిన దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి.  ఐసీఐసీఐ బ్యాంకు షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరుగుతుండగా. ఐసీఐసీఐ 2శాతం, ఎస్ బీఐ 1శాతం మేర పడిపోతోంది. దీంతో నిఫ్టీ బ్యాంకు 1శాతం కిందకు జారింది. నిఫ్టీలో మేజర్ షేరుగా ఉన్న ఇన్ఫోసిస్ సైతం 1శాతం మేర పతనమైంది.


స్థూల ఆర్థిక డేటా కూడా బలహీనంగా ఉండటంతో, జూన్ లో ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందనే ఆశలను మార్కెట్లు కోల్పోతున్నాయి. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా వడ్డీరేట్లలో మార్పులకు రిజర్వ్ బ్యాంకు మొగ్గు చూపుతుంటుంది. అయితే ఈసారి ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ట స్థాయికి పెరగడంతో, తదుపరి వడ్డీ రేట్ల కోతకు అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. పారిశ్రామికోత్పత్తి కూడా నత్తనడకనే సాగడం మార్కెట్లపై ప్రభావం చూపింది.


టాటా మోటార్స్, విప్రో, బజాజ్ ఆటో, ఏషియన్ పేయింట్స్, హెచ్ యూఎల్ లాభాలను నమోదుచేస్తుండగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ లు నష్టాల్లో నడుస్తున్నాయి. మరోవైపు పసిడి, వెండి లాభాలను ఆర్జిస్తున్నాయి. బంగారం, వెండి రెండూ రూ.28 లాభంతో రూ.29,929, రూ.40,831 గా నమోదవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.75గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement