
‘నల్లధనం’ క్రమబద్ధీకరణ దరఖాస్తులకు ఆహ్వానం
లెక్కల్లో చూపని విదేశీ ఆస్తులను బ్లాక్మనీ చట్టం కింద వెల్లడించిన వారు ఆ సొత్తును క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ సూచించింది.
ముంబై: లెక్కల్లో చూపని విదేశీ ఆస్తులను బ్లాక్మనీ చట్టం కింద వెల్లడించిన వారు ఆ సొత్తును క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రిజర్వ్ బ్యాంక్ సూచించింది. సదరు ఆస్తిని వెల్లడించిన 180 రోజుల్లోగా ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్, ఫారిన్ ఎక్స్చేంజి డిపార్ట్మెంట్ (ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ డివిజన్)ని ఉద్దేశిస్తూ దీన్ని పంపాల్సి ఉంటుందని వివరించింది. 2015 జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన బ్లాక్ మనీ చట్టం.. విదేశీ ఆస్తుల వెల్లడించి, పన్నులు కట్టేందుకు నిర్దిష్ట కాలం పాటు ఒకసారి అవకాశం కల్పించింది. దీని గడువు గతేడాది సెప్టెంబర్తో ముగిసింది. దీని కింద సుమారు 600 డిక్లరేషన్స్ రాగా ఖజానాకు రూ. 2,428 కోట్లు వచ్చాయి. వన్ టైమ్ అవకాశాన్ని వినియోగించుకున్న వారిపై విదేశీ మారక నిర్వహణ చట్టం కింద చర్యలు ఉండబోవని ఆర్బీఐ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.