
స్థిరపడుతున్న సానుకూలత!
నగర స్థిరాస్తి మార్కెట్లో అమ్మకాల ప్రవాహం మొదలైంది. పాత నిర్మాణాల్లో ఫ్లాట్లు లేకపోవడంతో కొత్త ప్రాజెక్ట్ల ధరలు కొద్దిగా పెంచేశారు బిల్డర్లు.
సాక్షి, హైదరాబాద్ : నగర స్థిరాస్తి మార్కెట్లో అమ్మకాల ప్రవాహం మొదలైంది. పాత నిర్మాణాల్లో ఫ్లాట్లు లేకపోవడంతో కొత్త ప్రాజెక్ట్ల ధరలు కొద్దిగా పెంచేశారు బిల్డర్లు. మరోవైపు బడా ప్రాజెక్ట్ల నిర్మాణం కోసం సరైన స్థలాల కోసం సంస్థల మధ్య పోటీ మొదలైంది. తక్షణమే ప్రాజెక్ట్లను ప్రకటించడానికి డెవలపర్లు అడుగులేస్తున్నారు.
⇔నిన్నటిదాకా వేచిచూసే ధోరణికి అలవాటు పడ్డవారిలో కొందరు మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొనడంతో స్థానిక పరిస్థితులను పక్కన పెట్టేసి సొంతిళ్లను కొనడానికి ముందుకొస్తున్నారు. స్థిరాస్తి రంగం చాలా భిన్నమైంది. మార్కెట్ ప్రతికూలంగా ఉందనుకోండి.. ధర తక్కువైనా ఇళ్లను కొనడానికి కొనుగోలుదారులు ముందుకు రారు. అదే కొంచెం తేరుకోగానే చాలు.. చ.అ.కు రూ.100 ఎక్కువ పెట్టయినా ఇళ్లను కొనేస్తారు.
⇔రెండు నెలల నుంచి వాణిజ్య స్థిరాస్తి రంగం కూడా మెరుగైంది. నిర్మాణ రంగం అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు ప్రతికూల పరిస్థితుల్లో ఉండటంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
⇔మార్కెట్లో పెరిగిన సానుకూల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని డెవలపర్లు సరైన స్థలాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. స్థానిక సంస్థల నుంచి మెట్రో నగరాలకు చెందిన కంపెనీలు హైదరాబాద్లో స్థలాల కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. మార్కె ట్లో నెలకొన్న గిరాకీని అర్థం చేసుకున్న పలువురు స్థల యజమానులు ఇష్టమొచ్చిన రేట్లు చెబుతున్నారు. తమ కోర్కెల చిట్టాను డెవలపర్ల ముందు పెడుతున్నారు. అయితే భూయజమానులు చెబుతున్న నిబంధనలకు కొందరు డెవలపర్లు అంగీకరిస్తున్నప్పటికీ పొరపాటున ప్రతికూల పరిస్థితులు ఎదురైతే గనక ప్రాజెక్ట్ పూర్తి కావడ మే ప్రశ్నార్థకం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా రు. మార్కెట్ మెరుగవ్వగానే నిర్మాణాన్ని ఆరంభించి ఆ తర్వాత చేతులు కాల్చుకోవడం బదులు వాస్తవాల్ని అర్థం చేసుకుని నిర్మాణాల్ని మొదలుపెట్టాలని సూచిస్తున్నారు. ఈ సమయంలోనే స్థల య జమానులు వాస్తవిక పరిస్థితులు అర్థం చేసుకుని డెవలపర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. లేకపోతే ఇరువురికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెబుతున్నారు.
మెట్రో, ఓఆర్ఆర్లతో..
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లైన మెట్రో రైలుతో నగరంలో, ఔటర్ రింగ్ రోడ్డుతో శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి మార్కెట్ జోరందుకుంటుంది. ఓఆర్ఆర్తో ప్రయాణం సులువవుతుంది కాబట్టి ఔటర్ చుట్టూ నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలూ ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలో రూ.70-80 లక్షలు పెట్టి ఫ్లాట్లు కొనేబదులు.. శివార్లలో లగ్జరీ విల్లాలను కొనేయచ్చని కస్టమర్ల అభిప్రాయం.
స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com