
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాదిలో ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు 4–7 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ను పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలను పరిగణలోనికి తీసుకుని ఈమేరకు అంచనాను ప్రకటిస్తున్నట్లు స్పష్టంచేసింది. వ్యవసాయ–ఉత్పత్తుల ధరలు స్తబ్దుగా ఉండడం.. భద్రత, బీఎస్–6 ఉద్గార నిబంధనలు, రిజిస్ట్రేషన్ అంశాలతో పెరిగిన వాహన ధరలు, వడ్డీ వ్యయం పెరగడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో పట్టణ, గ్రామీణ మార్కెట్లలో వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉందని పేర్కొంది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో 21.6 శాతం క్షీణతను నమోదుచేసిన ఈ రంగానికి.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఆలస్యమైపోయిందని, ఈ రంగాన్ని గాడిలో పెట్టడానికి తాజా ప్రకటనలు మాత్రమే సరిపోవని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ రేటింగ్స్కు అనుబంధంగా ఉన్న ఫిచ్ సొల్యూషన్స్ పేర్కొంది.