ప్రభుత్వ రంగం నుంచి టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత కూడా 'ఎయిర్ ఇండియా' కష్టాలు తీరడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (మార్చి 31తో ముగిసిన కాలానికి) ఈ విమానయాన సంస్థ ఏకంగా రూ. 22,000 కోట్లకు (2.7 బిలియన్ డాలర్లు)పైగా నష్టాన్ని చవిచూసినట్లు తెలుస్తోంది. దీంతో సంస్థను గట్టెక్కించేందుకు వాటాదారుల నుంచి భారీగా నిధుల సమీకరణకు ఎయిర్ ఇండియా సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అంతర్జాతీయ పరిణామాలు, సాంకేతిక సమస్యలు ఎయిర్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ సమస్యలు, పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానాలకు మూసివేయడం వల్ల పెరిగిన ఇంధన ఖర్చులు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం సంస్థను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఇవి ఆపరేటింగ్ ఖర్చులను భారీగా పెంచడమే కాకుండా, ఆదాయ మార్గాలను కూడా ప్రభావితం చేశాయి.
సంక్షోభ నివారణకు మెజారిటీ వాటాదారు అయిన టాటా గ్రూప్, 25.1 శాతం వాటా కలిగిన సింగపూర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ చర్చలు జరుపుతున్నట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఎయిర్ ఇండియాకు అవసరమైన నగదును ఇన్ఫ్యూషన్ (నగదు ఇంజెక్షన్) రూపంలో అందించే విషయమై ఈ రెండు సంస్థలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, భాగస్వామ్య సంస్థల నుండి అందే నిధులు అవసరానికి సరిపోతాయా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నిధుల సమీకరణ పరిమాణంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ వాటాదారుల నుండి వచ్చే మొత్తం సరిపోకపోతే, ఎయిర్ ఇండియా ఇతర ఫైనాన్సింగ్ మార్గాలను వెతకాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై అటు టాటా గ్రూప్ గానీ, ఇటు ఎయిర్ ఇండియా ప్రతినిధులు గానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.


