
న్యూఢిల్లీ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచొద్దంటూ చమురు కంపెనీలకు ప్రభుత్వం ఆదేశించిందన్న వార్తలపై కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. చమురు మార్కెటింగ్ సంస్థలకు ప్రభుత్వం అలాంటి ఆదేశాలేమీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ‘‘ఇంధన రంగంలో పోటీని పెంచేందుకే ధరలపై ప్రభుత్వం నియంత్రణను ఎత్తివేసింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా రేట్లు సవరించుకునేలా దేశీ ఆయిల్ కంపెనీలకు స్వేచ్ఛనివ్వడం వ్యూహాత్మకమైన నిర్ణయం’’ అన్నారాయన. రేట్లను పెంచొద్దంటూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ చమురు కంపెనీలు కూడా స్పష్టం చేసిన సంగతి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గతేడాది జూన్ నుంచీ రోజువారీ రేట్లు సవరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నా ఇవి పెట్రోల్ రేటును 4 పైసలు, డీజిల్ ధరను 3 పైసలు తగ్గించడం చర్చనీయాంశమయింది. గతేడాది డిసెంబర్లో గుజరాత్ ఎన్నికల సమయంలో కూడా ఇండియన్ ఆయిల్ వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆ నెల ప్రథమార్థంలో ప్రతి రోజూ 1–3 పైసల మేర రేట్లు తగ్గించాయి. డిసెంబర్ 14న ఎన్నికలు అయిపోయిన వెంటనే రేట్లు పెరగడం మళ్లీ మొదలైంది.