రిలయన్స్‌లో పెరిగిన అంబానీ వాటా | Mukesh Ambani Stake Increases In Reliance | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌లో పెరిగిన అంబానీ వాటా

Sep 19 2019 2:39 AM | Updated on Sep 19 2019 3:12 AM

Mukesh Ambani Stake Increases In Reliance - Sakshi

న్యూఢిల్లీ : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో ప్రమోటర్‌ ముకేశ్‌ అంబానీ వాటా మరింతగా పెరిగింది. ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థ పెట్రోలియమ్‌ ట్రస్ట్‌ నియంత్రణలోని రిలయన్స్‌ సర్వీసెస్‌ అండ్‌ హోల్డింగ్స్‌ కంపెనీ ఈ నెల 13న 2.71 శాతం వాటాకు సమానమైన 17.18 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో ముకేశ్‌ అంబానీ వాటా 48.87 శాతానికి పెరిగిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే రెండో అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ముకేశ్‌ అంబానీ, ఆయన సంబంధిత ప్రమోటర్‌ సంస్థలకు 47.29 శాతం వాటా ఉంది.

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ)లకు 24.4 శాతం, మ్యూచువల్‌ ఫండ్స్‌కు 4.56 శాతం, బీమా కంపెనీలకు 7.1 శాతం చొప్పున వాటాలుండగా, మిగిలింది ప్రజల వద్ద ఉంది. కాగా ప్రమోటర్‌ ముకేశ్‌ అంబానీ వాటా పెంపు వార్తలతో బీఎస్‌ఈ ఇంట్రాడేలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 1.6 శాతం లాభంతో రూ.1,216ను తాకింది. చివరకు 0.7 శాతం లాభంతో రూ.1,206 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement