మహీంద్రా జోరును తగ్గించిన ట్రాక్టర్లు | Mahindra Tractors reduced momentum | Sakshi
Sakshi News home page

మహీంద్రా జోరును తగ్గించిన ట్రాక్టర్లు

Aug 8 2015 12:30 AM | Updated on Sep 3 2017 6:59 AM

మహీంద్రా జోరును తగ్గించిన ట్రాక్టర్లు

మహీంద్రా జోరును తగ్గించిన ట్రాక్టర్లు

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.852 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది

3 శాతం తగ్గిన నికర లాభం
 
ముంబై : మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.852 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో ఆర్జించిన నికర లాభం రూ.882 కోట్లతో పోలిస్తే 3 శాతం క్షీణత నమోదైందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. అమ్మకాలు క్షీణించడం, ట్రాక్టర్ల వ్యాపారం కుదేలవటంతో నికర లాభం తగ్గిందని మహీంద్రా గ్రూప్ ఈడీ పవన్ గోయెంకా చెప్పారు. నికర అమ్మకాలు 3 శాతం క్షీణించి రూ.9,708 కోట్లకు తగ్గాయని వివరించారు. ఈ క్యూ1లో పరిశ్రమ అమ్మకాలు 7 శాతం పెరగ్గా, తమ అమ్మకాలు 3 శాతం తగ్గాయని పేర్కొన్నారు.

కన్సాలిడేషన్ ప్రాతిపదికన ఆదాయం రూ.10,734 కోట్ల నుంచి రూ.10,474 కోట్లకు,  ఇతర ఆదాయం రూ.189 కోట్ల నుంచి రూ.163 కోట్లకు తగ్గాయని  చెప్పారు. జులైలో ట్రాక్టర్ల అమ్మకాలు 12% క్షీణించాయని, ప్రస్తుత క్వార్టర్(జూలై-సెప్టెంబర్)లో ట్రాక్టర్ల వ్యాపారంపై ప్రతికూల ప్రభావం ఉండగలదని గోయెంకా వివరించారు. క్యూ1లో మార్జిన్లు 14 శాతం పెరిగాయని గ్రూప్ సీఎఫ్‌ఓ జి. పార్థసారధి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో మహీంద్రా షేర్ 0.5 శాతం క్షీణించి రూ.1,388 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement