‘సిరియా’ భయాలతో పసిడి మెరుపులు! | gold prices rise following US airstrikes in Syria | Sakshi
Sakshi News home page

‘సిరియా’ భయాలతో పసిడి మెరుపులు!

Apr 10 2017 1:33 AM | Updated on Aug 25 2018 7:52 PM

‘సిరియా’ భయాలతో పసిడి మెరుపులు! - Sakshi

‘సిరియా’ భయాలతో పసిడి మెరుపులు!

బంగారం ధరపై 7వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ఉద్రిక్తతల పరిస్థితి ప్రభావం స్పష్టంగా కనిపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ద్రవ్య, పరపతి విధానాలు,

వారాంతంలో 1,272 డాలర్లకు పరుగు... మళ్లీ వెనక్కు!  
డాలర్‌ పటిష్టత, ట్రంప్‌ విధానాల అనిశ్చితీ కారణం


న్యూయార్క్‌/ముంబై: బంగారం ధరపై 7వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయ ఉద్రిక్తతల పరిస్థితి ప్రభావం స్పష్టంగా  కనిపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ద్రవ్య, పరపతి విధానాలు, దీనికి అనుగుణంగా డాలర్‌ పటిష్టతపై అనుమానాలతో అసలే బలంగా కనిపిస్తున్న పసిడి... సిరియాపై అమెరికా వైమానిక దాడుల వార్తలతో శుక్రవారం జోరందుకుంది. ఔన్స్‌ (31.1గ్రా) ధర అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ నైమెక్స్‌లో ఒక్కసారిగా 1,272 డాలర్లకు చేరింది. చివరకు 1,256 డాలర్ల వద్ద ముగిసింది. వారం వారీగా చూస్తే ఇది దాదాపు 10 డాలర్లు అధికం.

మున్ముందూ దూకుడే!
అంతర్జాతీయ ఉద్రికత్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లకు రాబోయే కొద్ది వారాల్లో పసిడి ‘ఆర్థిక రక్షణ’గానే కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు ట్రంప్‌ విధానాలు, తదనుగుణంగా డాలర్‌ పటిస్టతపై అనిశ్చితి కూడా పసిడికి బలాన్నిచ్చే అంశాలేనన్నది వారి అభిప్రాయం. కాగా సిరియాపై దాడుల వార్తలతో ఒక్కసారిగా 100.42 స్థాయికి పడిన డాలర్‌ ఇండెక్స్‌... ఉద్రిక్తత క్రమంగా తగ్గిన కొద్దీ పెరుగుతూ 101.19 స్థాయికి చేరింది. చివరకు 101.08 వద్ద ముగిసింది. అంతక్రితం వారంలో డాలర్‌ 99.59–100.42 శ్రేణిలో తిరిగింది.

మార్చి 15న అమెరికా ఫెడ్‌– ఫండ్‌ రేటును 0.25 శాతం (0.75 శాతం – 1 శాతం శ్రేణికి) పెంచిన తరువాత, అనూహ్య రీతిలో డాలర్‌ బలహీనత– బంగారం బలోపేతం అయిన విషయం తెలిసిందే. కేవలం నాలుగు వారాల్లో పసిడి 40 డాలర్లకుపైగా పెరిగింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు,  డాలర్‌ బలహీనత కొనసాగితే, పసిడి మరింత ముందుకు కదలడం ఖాయమని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలిస్తే ఆయన అనుసరించే ‘డాలర్‌ బలహీనత’ విధానాల వల్ల పసిడి 1,800 డాలర్లకు క్రమంగా చేరుతుందని అధ్యక్ష ఎన్నికలకు ముందు పలు విశ్లేషణలు వెలువడ్డాయి. కాగా పసిడికి 1,200 డాలర్ల వద్ద మద్దతు ఉందనీ, ఇది పోతే 1,170 డాలర్ల వద్ద మరో మద్దతు ఉందనీ విశ్లేషకులు చెబుతున్నారు.

దేశీయంగానూ అదే ట్రెండ్‌..
అంతర్జాతీయ ప్రభావం దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌పైనా పడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌)లో బంగారం ధర 10 గ్రాములకు 7వ తేదీతో ముగిసిన వారంలో రూ.221 పెరిగి రూ.28,684కి చేరింది. ఇక దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్‌ మార్కెట్లో వారం వారీగా పసిడి ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములకు రూ.150 పెరిగి రూ.28,925కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.28,775కి చేరింది. మరోవైపు వెండి పెరుగుదల కొనసాగుతోంది. వారంలో కేజీ ధర రూ. 265 పెరిగి రూ.42,630కి పెరిగింది. గడచిన నాలుగు  వారాల్లో వెండి కేజీ ధర దాదాపు రూ.1,500 పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement