భారీగా పెరిగిన బంగారం ధరలు | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన బంగారం ధరలు

Published Wed, Oct 3 2018 4:47 PM

Gold Prices Jump Over 550 Rupees - Sakshi

న్యూఢిల్లీ : బంగారం ధరలు భారీగా పెరిగాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు, స్థానిక ఆభరణ వర్తకుల జరుపుతున్న కొనుగోళ్ల సందడితో బంగారం ధరలకు ఊపు వచ్చింది. నేడు బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 550 రూపాయలకు పైగా ఎగిసి రూ.32,030ను టచ్‌ చేసింది. వెండి సైతం బంగారం మాదిరిగానే పెరిగి, కేజీకి రూ.39వేలకు పైగా నమోదైంది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో, వెండి కూడా ఎగిసింది. 

ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రక్షించేందుకు అమెరికా, కెనడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో, బంగారానికి డిమాండ్‌ పెరిగిందని ట్రేడర్లు చెప్పారు. అంతేకాక రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ట స్థాయిల్లోకి దిగజారుతుండటంతో, డాలర్‌తో జరిపే దిగుమతులు ఖరీదైనవిగా మారుతూ.. బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి.  

అటు గ్లోబల్‌గా కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. బడ్జెట్‌ లోటును అధిగమించేందుకు ఇటలీ ప్లాన్లలో ఆందోళనలు చెలరేగడంతో, బంగారానికి డిమాండ్‌ పెరుగుతోంది. స్పాట్‌ గోల్డ్‌ ధర 0.1 శాతం పెరిగి ఇంట్రాడేలో 1,203.31 డాలర్లుగా నమోదైంది. ఒక్క మంగళవారం రోజే ఏకంగా 1.3 శాతం పెరిగింది స్పాట్‌ గోల్డ్‌ ధర. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం 555 రూపాయల చొప్పున పెరిగి రూ.32,030గా, రూ.31,880గా నమోదైంది.  
 

Advertisement
Advertisement