వారి అకౌంట్లపై ఫేస్బుక్ నిషేధం
మయన్మార్లో రోహింగ్యా ముస్లింలు ఎదుర్కొంటున్న జాతి ప్రక్షాళనపై డాక్యుమెంట్ చేసిన కార్యకర్తల అకౌంట్లను ఫేస్బుక్ నిలిపివేసింది.
మయన్మార్లో రోహింగ్యా ముస్లింలు ఎదుర్కొంటున్న జాతి ప్రక్షాళనపై డాక్యుమెంట్ చేసిన కార్యకర్తల అకౌంట్లను ఫేస్బుక్ నిలిపివేసింది. అంతేకాక వారి పోస్టులను కూడా ఫేస్బుక్ నుంచి తొలగించిందని డైలీ బీస్ట్ రిపోర్టు చేసింది. అయితే తమ అకౌంట్లను తరుచు నిలిపివేస్తుందని, నిజాలను నిర్భయంగా మాట్లాడేందుకు ఈ సోషల్ మీడియా దిగ్గజం అవకాశం కల్పించాలని రోహింగ్యా కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ వీరి పోస్టులను ఫేస్బుక్ తొలగిస్తోంది. అంతేకాక వీరి అకౌంట్లను నిలిపివేస్తోంది కూడా.
ప్రజలు బాధ్యతాయుతంగా పంచుకునే చోటు ఫేస్బుక్ కావాలని కోరుకుంటున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి రుచిక బుధ్రాజ్ తెలిపారు. తమ కమ్యూనిటీ స్టాండర్స్కు వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ను జాగ్రత్తగా సమీక్షిస్తున్నామని తెలిపారు. రహిమ్ అనే పేరుతో పేస్బుక్లో రోహింగ్యా శరణార్థుల గురించి పోస్టు చేసిన వ్యక్తిగత పోస్టులను ఫేస్బుక్ తొలగించింది. ఫేస్బుక్ కమ్యూనిటి స్టాండర్స్ను అనుసరించకపోవడం వల్ల కంటెంట్ను తొలగిస్తున్నామని ఫేస్బుక్ ఓ మెసేజ్ అందించింది.
రోహింగ్యా ముస్లింలను బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులుగా ఇటు మయన్మార్ గుర్తిస్తుండగా.. అటు బంగ్లాదేశ్ వీరిని మయన్మార్ సిటిజన్లుగా పేర్కొంటోంది. వీరికి పౌరసత్వం ఇవ్వడానికీ మయన్మార్ తిరస్కరిస్తోంది. అంతేకాక రోహింగ్యా ముస్లింలపై మయన్మార్లో జాతి విద్వేష దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులతో రోహింగ్యా ముస్లింలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఆశ్రయం ఇచ్చి ప్రాణభిక్ష పెట్టాల్సిందిగా బ్రతిమాలాడుతున్నారు.