నగదు రాజు అయితే.. డిజిటల్‌ దైవం

Cash is King Then Digital Wallets is God Said RBI - Sakshi

ఆర్‌బీఐ సరికొత్త నినాదం

ముంబై: నగదు రాజు అయితే డిజిటల్‌ కరెన్సీ దైవంగా ఆర్‌బీఐ పేర్కొంటోంది. డీమోనిటైజేషన్‌ తర్వాత వ్యవస్థలో రూ.3.5 లక్షల కోట్ల మేర నగదు వినియోగం తగ్గిందన్న ఆర్‌బీఐ, డిజిటల్‌ చెల్లింపులను గొప్ప అనుభవంగా మార్చడమే తన ప్రయత్నమని తెలిపింది. వ్యవస్థలో నగదు చెల్లింపులకు సంబంధించి కచ్చితమైన కొలమానాలు లేవని, డిజిటల్‌ చెల్లింపుల ప్రగతిని మాత్రం కచ్చితంగా లెక్కించొచ్చని పేర్కొంది. గత ఐదేళ్లలో డిజిటల్‌ చెల్లింపులు సంఖ్యా పరంగా వార్షికంగా 61 శాతం, విలువ పరంగా వార్షికంగా 19 శాతం చొప్పున వృద్ది చెందినట్టు తెలిపింది. ఇప్పటికీ నగదు ఆధిపత్యం కొనసాగుతోంది. చెల్లింపులకు బదులు నిల్వ చేసుకునే ఆర్థిక సాధనంగా చూస్తున్నారు’’ అని ఆర్‌బీఐ తెలిపింది.

వ్యవస్థలో నోట్ల చలామణి 2014 అక్టోబర్‌ నుంచి 2016 అక్టోబర్‌ మధ్య 14 శాతం చొప్పున పెరిగినట్టు వెల్లడించింది. ఇదే వృద్ధి రేటు ప్రకారం 2019 అక్టోబర్‌ నాటికి చలామణిలో ఉన్న నోట్లు రూ.26,04,953 కోట్లు అని తెలిపింది. డిజిటైజేషన్, నగదు వినియోగం తగ్గడం వల్ల చలామణిలో ఉన్న నోట్లు రూ.3.5 లక్షల కోట్ల మేర తగ్గిపోయినట్టు వెల్లడించింది. ‘‘డీమోనిటైజేషన్, జీడీపీ చురుకైన వృద్ధి రేటు ఫలితంగా చలామణిలో ఉన్న నగదు 2016–17 నాటికి జీడీపీలో 8.7 శాతానికి తగ్గింది. ఇది తదుపరి 2017–18 నాటికి 10.7 శాతానికి, 2018–19 నాటికి 11.2 శాతానికి పెరిగింది. అయినప్పటికీ డీమోనిటైజేషన్‌కు పూర్వం 2015–16 నాటికి ఉన్న 12.1 శాతం కంటే తక్కువ నగదే చలామణిలో ఉంది’’ అని ఆర్‌బీఐ తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top