ఎలక్ట్రానిక్స్ రంగానికి వరాలు ! | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రానిక్స్ రంగానికి వరాలు !

Published Fri, Jul 11 2014 12:57 AM

ఎలక్ట్రానిక్స్ రంగానికి వరాలు !

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వృద్ధికి దోహదపడే పలు చర్యలను ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించారని ఈ పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనల  కారణంగా దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ జోరు పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆ వర్గాలు అంటున్నాయి.

 1. టెలికాం, ఐటీ ఉత్పత్తుల దిగుమతులపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ(బీసీడీ)ని విధింపు.  దేశీయ ఉత్పత్తికి ఊతమివ్వడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం లక్ష్యాలుగా ఈ చర్య తీసుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్ 1లో లేని ఐటీ, టెలికాం ఉత్పత్తులకు ఈ సుంకం వర్తిస్తుంది.  ఈ చర్య కారణంగా వీఓఐపీ ఫోన్‌లు, కొన్ని టెలికాం నెట్‌వర్క్ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది.

 2. పర్సనల్ కంప్యూటర్ల తయారీలో ఉపయోగించే విడిభాగాలపై ప్రస్తుతం విధిస్తున్న 4 శాతం స్పెషల్ అడిషనల్ డ్యూటీ(ఎస్‌ఏడీ)ను తొలగించారు. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై విద్యా సుంకాన్ని విధించారు. ఫలితంగా దేశీయంగా తయారయ్యే ఉత్పత్తుల ధర, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల ధర ఒకే విధంగా ఉంటుంది.  

 3. కలర్ పిక్చర్ ట్యూబ్‌లపై దిగుమతి సుంకం తొలగింపు.  దీంతో వీటి ధరలు మరింతగా తగ్గుతాయి.

 4. 19 అంగుళాల లోపు  ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీల తయారీలో ఉపయోగపడే స్క్రీన్‌లపై 10 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా తొలగించారు. ఫలితంగా వీటి ధరలు తగ్గుతాయి.

 5. ఒక ఏడాదిలో రూ. 25 కోట్లకు మించిన పెట్టుబడులపై 15% మూలధన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఫలి తంగా ఎంఎస్‌ఎంఈలో పెట్టుబడుల  పెరుగుతాయి.

Advertisement
Advertisement