
రిలయన్స్ జియోకు కౌంటర్గా దానికంటే తక్కువ ధరకే ఎయిర్టెల్ తన కొత్త 4జీ స్మార్ట్ఫోన్ను ప్రకటించింది. రూ.1,399 ధరకే 4జీ స్మార్ట్ఫోన్ను హ్యాండ్సెట్ తయారీదారి కార్బన్ మొబైల్స్ భాగస్వామ్యంతో అందిస్తున్నట్టు బుధవారం వెల్లడించింది. 4జీ స్మార్ట్ఫోన్ ధర, ఫీచర్ ఫోన్ ధర ఒకేలా ఉంచేలా తన స్మార్ట్ఫోన్ను ఎయిర్టెల్ రంగంలోకి దింపింది. ఆండ్రాయిడ్ ఆధారితంగా వస్తున్న ఈ స్మార్ట్ఫోన్ ఫుల్ టచ్ స్క్రీన్ అనుభవం, డ్యూయల్ సిమ్ స్లాట్లు, యూట్యూట్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి పాపులర్ యాప్స్ సపోర్టును అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ పేరు కార్బన్ ఏ40 ఇండియన్గా నిర్ణయించినట్టు ఎయిర్టెల్ చెప్పింది. దీని ధర రూ.1,399గా పేర్కొంది. నెలవారీ రూ.169 రీఛార్జ్ ప్యాక్తో డేటా ఆఫర్లు, పలు ప్రయోజనాలను ఈ ఫోన్పై ఆఫర్ చేస్తోంది. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే స్టాక్స్ అందుబాటులో ఉన్నాయని, దగ్గర్లోని కార్బన్ రిటైల్ స్టోర్లో వీటిని పొందవచ్చని కూడా ఎయిర్టెల్ తన వెబ్సైట్లో తెలిపింది.
అత్యధిక వేగవంతంగా డేటాను యాక్సస్ చేసుకునేలా ప్రతి భారతీయుడికి డిజిటల్ సాధికారిక కల్పించాలని ఎయిర్టెల్ లక్ష్యంగా పెట్టుకుందని భారతీ ఎయిర్టెల్ సీఎంఓ రాజ్ పుదిపేడి చెప్పారు. కార్బన్తో భాగస్వామ్యం ఏర్పరచుకుని, స్మార్ట్ఫోన్ ఎంపికలో ఉన్న లోపాలను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. అచ్చం జియో మాదిరే క్యాష్ రీఫండ్ ఆఫర్ను ఎయిర్టెల్ ప్రకటించింది. కస్టమర్లు ఈ స్మార్ట్ఫోన్ కోసం రూ.2,899ను డౌన్పేమెంట్ చేయాల్సి ఉందని, దీంతో 36 నెలలు కొనసాగింపుగా నెలవారీ రూ.169తో రీఛార్జ్ అవుతూ ఉంటుందని తెలిపింది. 18 నెలల అనంతరం రూ.500 క్యాష్ రీఫండ్, 36 నెలల తర్వాత మరో రూ.1000 అంటే మొత్తంగా రూ.1500 ప్రయోజనాలు పొందవచ్చు. రీఛార్జ్ మొత్తాలను కూడా కలుపుకుంటే మొత్తంగా కార్బన్ఏ40 ఇండియన్ ధర 3,499 రూపాయలు.