వైఫై కనెక్షన్‌ : అర్థగంటకు రూ.500 | Airlines mull in-flight Wi-Fi but may charge 30% of fare  | Sakshi
Sakshi News home page

వైఫై కనెక్షన్‌ : అర్థగంటకు రూ.500

Jan 23 2018 7:27 PM | Updated on Oct 2 2018 7:37 PM

Airlines mull in-flight Wi-Fi but may charge 30% of fare  - Sakshi

చెన్నై : విమానాల్లో త్వరలోనే వైఫై సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. ఆకాశంలో ఉండగానే నెట్ వాడుకోవచ్చు. సెల్ఫీలు దిగి పోస్ట్ చేసుకోవచ్చు. ఇక స్నేహితులతో చాట్ చేసుకోవచ్చు. అయితే, ఇవన్నీ చాలా ఖరీదుతో కూడుకున్నవిగా ఉండబోతున్నాయి. వీటి కోసం విమాన చార్జీలతో కలిపి అదనంగా 20 శాతం నుంచి 30 శాతం చెల్లించాల్సి ఉండనుంది. ట్రాయ్ ఆదేశాలతో విమానంలో వైఫై సేవలను ప్రారంభించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పెను భారం వినియోగదారులపైనే పడబోతున్నట్టు తెలిసింది. అంతర్జాతీయ ప్రమాణాల పరంగా 30 నిముషాల నుంచి గంట వరకు నెట్‌కనెక్షన్‌ కోసం రూ.500 నుంచి రూ.1000 వరకు ఛార్జీలు విధించనున్నట్టు అధికారులు చెప్పారు. వాస్తవానికి విమానయాన సంస్థలు ఇన్‌ఫ్లైట్ వైఫై సేవల కోసం ఇన్మార్‌శాట్ తదితర సర్వీస్ ప్రొవైడర్లకు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దేశీయ మార్గాల్లో ఇన్‌ఫ్లైట్ ఇంటర్నెట్ సౌలభ్యం కోసం అడ్వాన్స్ బుకింగ్ చార్జీలు రూ.1200 నుంచి రూ.2,500 దాకా ఉండబోతున్నాయి.

ఈ నేపథ్యంలో వినియోగదారులకే కాకుండా విమానయాన సంస్థలకూ ఆ చార్జీలు భారంగానే పరిణమించనున్నాయి. ఖండాంతర, దేశీయ మార్గాల్లో ప్రయాణించే విమానాలకు ఇన్‌ఫ్లైట్ వైఫై వెసులుబాటు ప్రయోజనం చేకూరుస్తుందని ఓ విమానయాన సంస్థ అధికారి ఒకరు చెప్పారు. అంతేగాకుండా భారత గగనతలంలో ఉన్నప్పుడు వైఫైని స్విచాఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన చెప్పారు. దేశీయ విమానాల్లో వైఫై సౌకర్యం గురించి చర్చిస్తున్నామని, దానిపై పూర్తి నిర్ణయం తీసుకునేముందు దాని చార్జీలు, వైఫైకి ఉన్న డిమాండ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఓ ప్రైవేటు విమానయాన సంస్థ అధికారి ఒకరు సూచించారు. ఇక, వైఫై సేవలను అందించేందుకు గానూ సిగ్నల్స్‌ కోసం విమానాల్లో యాంటెన్నాను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement