నేటి నుంచి యువజనోత్సవాలు

Yuvajanothsavalu In Guntur ANU - Sakshi

ఏఎన్‌యూ వేదికగా మూడు రోజుల పాటు సాగనున్న కళా ఉత్సవం

యువజనోత్సవాల కోఆర్డినేటర్‌ డాక్టర్‌ మురళీమోహన్‌

గుంటూరు, ఏఎన్‌యూ:   ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల యువజనోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే యువజనోత్సవాలకు ఏఎన్‌యూ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 30కి పైగా కళాశాలల నుంచి 1200 మంది వరకు యువతీ యువకులు పాల్గొంటారని యువజనోత్సవాల కోఆర్డినేటర్‌ డాక్టర్‌ మురళీమోహన్‌ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఏఎన్‌యూ క్రీడా ప్రాంగణంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో నారా రోహిత్‌ పాల్గొంటారన్నారు. వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్, రిజిస్ట్రార్‌ ఆచార్య కే జాన్‌పాల్, పలువురు యూనివర్సిటీ అధికారులు పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఏఎన్‌యూ క్రీడా ప్రాంగణం, విద్యార్థి కేంద్రం తదితర ప్రాంతాల్లో వేదికలు సిద్ధం చేశామని చెప్పారు.

పోటీల షెడ్యూల్‌
శనివారం ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని మురళీమోహన్‌ చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు మ్యూజిక్‌ విభాగంలో క్లాసికల్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ సోలో(నాన్‌పెర్క్యూషన్‌), క్లాసికల్‌ ఇన్‌స్ట్రుమెంటల్‌ సోలో(పెర్క్యూషన్‌), వెస్ట్రన్‌ వోకల్‌(సోలో), గ్రూప్‌సాంగ్‌(వెస్ట్రన్‌) అంశాల్లో, థియేటర్‌ విభాగంలో మిమిక్రీ, మైమ్, ఫైన్‌ఆర్ట్స్‌ విభాగంలో ఆన్‌ద స్పాట్‌ పెయింటింగ్, క్లేమోడలింగ్, పోస్టర్‌ మేకింగ్, మెహంది, డాన్స్‌ విభాగంలో క్లాసికల్‌ డాన్స్, ఫోక్‌ ఆర్కెస్ట్రా, క్విజ్‌ విభాగంలో ప్రిమిలినరీ, ఫైనల్‌ పోటీలు జరుగుతాయన్నారు. 16వ తేదీన ఉదయం 9:30 గంటలకు లిటరరీ ఈవెంట్స్‌లో డిబేట్, ఎలక్యూషన్‌ అంశాల్లోను, థియేటర్‌ విభాగంలో వన్‌ యాక్ట్‌ప్లే, ఫైన్‌ఆర్ట్స్‌ విభాగంలో స్పాట్‌ ఫోటోగ్రఫీ, కొల్లేజ్‌ అంశాల్లోను, మ«ధ్యహ్నం 12 గంటలకు మ్యూజిక్‌ విభాగంలో క్లాసికల్‌ ఓకల్‌ సోలో( హిందూస్థానీ/కర్నాటక), లైట్‌ ఓకల్‌ (సోలో), గ్రూప్‌సాంగ్‌ ( ఇండియన్‌) అంశాల్లోను ఫైన్‌ ఆర్ట్స్‌లో ఇన్‌స్టాలేషన్‌ అండ్‌ కార్టూనింగ్‌లోను పోటీలు ప్రారంభమవుతాయి. 17వ తేదీ ఉదయం 9:30 గంటలకు డాన్స్‌ విభాగంలో ఫోక్‌ డాన్స్‌/ట్రైబల్‌ డాన్స్, థియేటర్‌ విభాగంలో స్కిట్, ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో రంగోలి అంశాల్లోను పోటీలు జరుగుతాయి. సాయింత్రం 4 గంటలకు జరిగే ముగింపు కార్యక్రమానికి సినీ నటుడు పృథ్వీరాజ్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top