బాబు..వ్యవసాయం లేని సింగపూర్ చేస్తారా?

బాబు..వ్యవసాయం లేని సింగపూర్ చేస్తారా? - Sakshi


తిరుపతి: పెండింగ్‌లో వున్న కోట్ల రూపాయల బకాయిలను రైతులకు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ, తిరుపతిలోని గాజులమండెం షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద వైఎస్‌ఆర్‌ సిపి నేతలు సోమవారం మహాధర్నాకు దిగారు. ధర్నాలో పాల్గొన్న నగరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా  ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను సింగపూర్ చేస్తా..సింగపూర్ చేస్తానంటూ...ఊదరగొడుతున్నారని, సింగపూర్లో వ్యవసాయం అనేది లేదని...ఏపీలో కూడా వ్యవసాయం లేకుండా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తుందన్నారు.



మొక్కలోనే వ్యవసాయాన్ని తుంచేయాలనే చందంగా షుగర్ ఫ్యాక్టరీ బకాయిలను ఇవ్వకుండా  చంద్రబాబు నాయుడు వ్యవహరించటం దారుణమన్నారు. పంట భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారి పరం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని రోజా మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు షుగర్ ఫ్యాక్టరీలను ప్రయివేట్ వ్యక్తుల పరం చేశారని ఆమె ఆరోపించారు.



వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీ బకాయిల నిమిత్తం రూ.300 కోట్లు విడుదల చేశారని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు నేను ఉన్నానంటూ వైఎస్ ధైర్యాన్ని ఇచ్చారన్నారు. అలాంటిది చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు వ్యవసాయాన్ని పండుగ చేస్తాను, రుణమాఫీ అంటూ రైతులను అబద్దాల హామీలతో మోసం చేశారన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలభిస్తున్నారని రోజా మండిపడ్డారు. రైతుల నుంచి చెరుకును.. టన్నుకు మూడు వేల చొప్పుల చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top