
'చంద్రబాబు అండతోనే దాడులు'
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే అధికారులపై దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్ సీపీ నేతలు పార్థసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్లు ఆరోపించారు.
విజయవాడ: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే అధికారులపై దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్ సీపీ నేతలు పార్థసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్లు ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నేతలు.. రవాణాశాఖ కమిషనర్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఒక విధానం, ప్రతిపక్షానికి మరో విధానం కొనసాగుతుందని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారథి అన్నారు. బస్సు ప్రమాదం సందర్భంగా అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షనేతపై కేసులు పెట్టిన అధికారులు.. ఎయిర్పోర్టులో జేసీ దివాకర్రెడ్డి వీరంగం సృష్టిస్తే కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇన్ని వందల అక్రమ బస్సులు ఎలా తిరుగుతున్నాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'కమిషనర్ తాను నోరు తెరిస్తే చాలా అక్రమాలు బయటపడతాయని అన్నారు. ఆ నిజాలేంటో చెప్పాలి. ఏ ఒత్తిడిలతో వాస్తవాలను అణచివేస్తున్నారో చెప్పాలి' అని పార్థసారథి అన్నారు. తమను తాము కాపాడుకోవడానికి అధికారులు దండం పెట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్న ఆయన.. వనజాక్షిపై దాడి చేసిన వారిని వెనుకోసుకొచ్చిన ముఖ్యమంత్రి రవాణా శాఖ కమిషనర్పై దాడి చేసినవారిని కూడా వెనుకేసుకొస్తారా లేక చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగ సంఘాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. పంచాయితీలు చేసే స్థితికి చంద్రబాబు దిగజారారన్నారు. ఎమ్మార్వో వనజాక్షి, టూరిజం సిబ్బందిపై దాడి ఘటనలో చర్యలు లేవని గుర్తు చేశారు. దాడికి పాల్పడిన కేశినేని నాని, బోండా ఉమపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.