పంటలెండిపోతున్నా స్పందించరేం?
ఉపసభాపతి బుద్ధప్రసాద్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త సింహాద్రి
అవనిగడ్డ : దివిసీమలో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయి, చచ్చిపోతున్న పంటను చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు, అయినా స్థానిక ప్రజాప్రతినిధి మండలి బుద్ధప్రసాద్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు ప్రశ్నించారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పాలనలో మంత్రిగా ఉన్న బుద్ధప్రసాద్ కొద్దిరోజులు సాగునీరు అందకపోతేఆందోళన చేశారని, ఇప్పుడు అంతకంటే దారుణ పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
పట్టిసీమ నుంచి నీళ్లు వస్తున్నాయని చెబుతున్నారని, ఈ నీరు ఎంత వస్తుంది, ఎన్ని రోజులు ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులకు సాగునీరు అందించలేని దుస్థితిలో ఉంటే స్థానిక ప్రజాప్రతినిధిగా మౌనం వహించడం వెనుక మర్మమేమిటని అన్నారు. ఇప్పటికైనా ఉపసభాపతి బుద్ధప్రసాద్ స్పందించి దివిసీమలో సాగునీరందక చనిపోతున్న పంటను బతికించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సింహాద్రి సూచించారు.