అన్నదాత కలల పండగ

YSR 71th Birth Anniversary Special Story In YSR Kadapa - Sakshi

ఆకాశవీధి నుంచి మేఘం దీవించేట్టు  అమృతాక్షితల్ని వాన చినుకుల రూపంలో వెదజల్లితే...  అవధుల్లేని ఆనందంతో పులకించి పోయేవాడు రైతన్న.  పుడమి ఒడిలో పుట్టిన పచ్చదనం... చివురు వేసి ఆశలు తొడిగితే... అంతులేని సంతోషంతో  పరవశించి పోయేవాడు రైతన్న.. నేలతల్లిని నమ్మి... సేద్యం చేసి మానవాళి ఆకలితీర్చే మహోన్నతుడు రైతన్న.. ఆ కష్టజీవికి... అంతటి ధన్య జీవికి ఒక్కడు గుడికట్టాడు... నేనున్నానని... నీకేం కాదని భుజం తట్టాడు.

అన్నదాతకు అండ నేనన్నాడు... అన్ని విధాలా ఆదుకున్నాడు. ఎండిన బతుకులకు ఏరువాకలా వచ్చి... వేదనను పరిమార్చిన  వర్షపు చినుకయ్యాడు. ఆ ఉదాత్తుడు.. ఆ ఉన్నతుడు...  అందుకే ‘రాజన్న’ కర్షకుల కంటి దీపమయ్యాడు. బడుగుల ఇంటి  వెలుగయ్యాడు.  వ్యవసాయం దండగన్న వ్యర్థ వ్యాఖ్యలను ఎండగట్టి... సేద్యాన్ని పండుగ చేసిన ఆ చిరునవ్వుల రేడు... నేడు లేకపోయినా... రైతన్న తలపాగలా... పొలానికి పచ్చదనపు నగలా వెలుగుతూనే ఉన్నాడు... ఉంటాడు.    

నాబిడ్డలకు అన్ననే అండ
మాది మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లె (మజరా నంద్యాలంపేట ) గ్రామం. మాకున్న ఎకర పొలంతోపాటు మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకున్నాం... పసుపు, మిరప, ఉల్లి పంటలను సాగు చేశాం. ఇలా రెండు మూడు సంవత్సరాలు సాగు చేసినా మా దరిద్రమేమోగాని ఒక పక్క పంట అరకొర దిగుబడి. దానికి గిట్టుబాటు ధరలేక పెట్టుబడులు తీరక రూ.6.50లక్షలకు పైగా అప్పులు అయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచక నా భర్త శ్రీనివాసులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అధికారులు వివరాలు రాసుకుపోయారు. ఏమి చేయాలో దిక్కుతోచలేదు. అయినా ప్రభుత్వ సాయం అందలేదు. అయితే మా కష్టాన్ని, మా బాధలను గుర్తించిన నేతగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.7లక్షల సాయం అందించి ఇంటి పెద్ద కొడుకుగా ఆదుకున్నారు. జగన్నను ఎప్పటికీ మరచిపోం...ప్రాణం ఉన్నంతవరకు ఆయకు రుణపడి ఉంటాం.     – గొడ్లవీటి రాధా, మహిళా రైతు, పెద్దశెట్టిపల్లె, మైదుకూరు మండలం  

ఊహించని భరోసా
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు, క్రిమి సంహారక మందులను అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం బయట కోనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. వాటిలో నాణ్యత లేక పోవడంతో పంట నష్టం వచ్చి కష్టాలు పడే వాళ్లం. ప్రభుత్వాలు కూడా పంట నష్ట పోతే పరిహారం ఇచ్చే దానికి సవాలక్ష నిబంధనలు పెట్టేవారు. వైఎస్‌ జగన్‌ వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నారు. ఇక ఏ చింతా ఉండదు.

వ్యవసాయం సులభతరం 
నాపేరు సిద్ధారెడ్డి, కేసీ అగ్రహారం, రెడ్డివారిపల్లిపంచాయతీ, రైల్వే కోడూరులో నివాసం ఉంటున్నాను. నాకు రెండెకరాల పొలం ఉంది. పలు పైర్లు సాగుచేస్తాను. పొలంబడి వల్ల రైతులకు వ్యవసాయంపై అవగాహన వచ్చింది. దీంతో సాగులో మెలకువలు నేర్చుకున్నాం. రసాయన ఎరువులు ఎక్కువగా వాడకూడదని.. సేంద్రియ ఎరువులతో మంచి దిగుబడి సాధించవచ్చని సూచించారు. నేడు మా ఊర్లో రైతులందరూ సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ముందుకు పోతున్నారు.

పరిహారం.. రైతుకు వరం
నా పేరు బీ రంగారెడ్డి. రాజంపేట మండలం ఆకేపాడు గ్రామం. ఈయనకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అరటి సాగచేస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌ మాసంలో ప్రకృతి ప్రకోపానికి 1.80 ఏకరా నష్టపోయాడు. పంట చేతికి వచ్చే ప్రకృతి రూపంలో అరటిగెలలను ధ్వంసం చేసింది. అరటి చెట్లు నేలకొరిగిపోయాయి. సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్రంగా నష్టపోయాడు. ముఖ్యమంత్రి వైఎస్‌   జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రకృతి ప్రభావంతో నష్టపోయిన ఈ రైతుకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ కింద పరిహారం అందచేస్తుండటంతో రంగారెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. గత ప్రభుత్వాలు తమ గురించి పట్టించుకోకపోయినా, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు పక్షపాతి అని నిరూపించిందని బాధిత రైతు అంటున్నారు.  

కాలువలు జలకళ.. ఇంట గలగల 
నా పేరు దీవెన నాగరాజు. నాది వేముల మండలం గొందిపల్లె గ్రామం, నాకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వర్షాలు పడితే పంట సాగు చేసుకోవాలి. లేదంటే భూమిని బీడుగా ఉంచుకోవాలి. అయితే ఈ ఏడాది పులివెందుల బ్రాంచ్‌ కాలువకు నీరు వదలడంతో నాకున్న రెండు ఎకరాలలో మే 9వ తేదీన వేరుశనగ పంట సాగు చేశా. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అయ్యాక కాలువకు నీటిని వదిలారు. రెండు నెలలుగా నీరు వస్తోంది. వర్షాలు లేకున్నా కాలువ నీటితోనే పంటలు పండించుకుంటున్నా. పంట పూతకు వచ్చి ఊడలు దిగే దశకు చేరింది. మరో 40రోజులలో పంట దిగుబడులు చేతికి వస్తాయి. ఖరీఫ్‌ సీజన్‌కు సకాలంలో కాలువకు నీటిని వదలడం తొలిసారి చూస్తున్నా.  నాతో పాటు రైతులందరి పొలాలు పచ్చగా కళకళలాడుతున్నాయి.  రైతుగా ఇంతకంటే ఇంకేం కోరుకుంటాం.

అన్న మద్దతు
ఈ రైతు పేరు చందు వెంకటసుబ్బయ్య. జమ్మలమడుగు మండలంలోని గొరిగేనూరు గ్రామం. ఈ ఏడాది తనకున్న ఆరు ఎకరాల్లో శనగ పంట సాగుచేశాడు. గతేడాది రబీ సీజన్‌లో సాగుచేసిన పంట దిగుబడి వచ్చింది. అయితే గిట్టుబాటు ధరలేదు. క్వింటాల్‌ కనీసం రూ.3800 మాత్రమే పలుకుతోంది. ఈ రేటుకు అమ్మకం చేస్తే నష్టంవస్తుంది. అయితే ప్రభుత్వం మద్దతు ధర కింద క్వింటాకు రూ. 4875 ప్రకటించింది. దీంతో మార్క్‌ఫెడ్‌ ద్వాదా మార్కెట్‌యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 25 క్వింటాల్‌ శనగలు మార్క్‌ఫెడ్‌లో విక్రయించాడు. డబ్బులు కూడా తన ఖాతాకు జమచేసిందని... ప్రభుత్వం ఆదుకోవడం తమకు ఎంతో ఊరట కలిగించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.  

జీవితాంతం రుణపడిఉంటాం
నా పేరు పోలయ్య. మాది కాశినాయన మండలం, మిద్దెల గ్రామం. నేను నరసాపురంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పంట పెట్టుబడి కోసం రుణం తీసుకున్నాను. నాలుగేళ్ల నుంచి సక్రమంగా పంటలు పండకపోవడంతో లోను రెన్యూవల్‌ చేయలేకపోయాను. గడువు దాటితే వడ్డీ అదనంగా పడింది. దీంతో పక్కన అప్పులు చేసి వడ్డీ కట్టి లోను రెన్యూవల్‌ చేయించుకున్నాను. అయితే జగనన్న రైతులకు వడ్డీ లేని రుణాలు అందించడం సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి వడ్డీ బాధ తప్పుతుంది. జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాను.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top