
జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడుస్తున్న అక్కచెల్లెమ్మలు (ఫైల్)
కిక్కిరిసిన రహదారులు..కార్యకర్తల జగన్నినాదాలు..హారతులు పట్టే ఆడపడుచులు..అభిమానులు పరిచిన పూల బాటలుకరచాలనం కోసం పోటీపడే యువకులుఅడుగో.. అన్నొచ్చాడంటూ కేరింతలు
ప్రతీ ముఖంలో కాంతిరేఖలుజన సంద్రాలైన బహిరంగ సభలు..జననేతకు ఆద్యతం జనం నీరాజనం పలికారు.జిల్లాలోని పల్లెలు, పట్టణాలు పండుగ కళను సంతరించుకున్నాయి.గత ఏడాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో22 రోజులపాటు నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపగా.. జనానికి భరోసా ఇచ్చింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రతో ప్రకాశం జిల్లా పరవశించింది. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో 22 రోజులపాటు కందుకూరు, కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి, పర్చూరు, చీరాల 9 నియోజకకవర్గాల పరిధిలో 19 మండలాలు, 124 గ్రామాలలో పాదయాత్ర సాగింది. 8 నియోజకవర్గాల లోని కందుకూరు, కనిగిరి, పొదిలి, అద్దంకి, చీమకుర్తి, తాళ్లూరు, ఇంకొల్లు, చీరాల లో బహిరంగ సభలు నిర్వహించారు. కొండపి నియోజకవర్గంలోని తిమ్మపాలెం వద్ద రైతు సదస్సు జరిగింది. మొత్తం 278.1 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది.
పిబ్రవరి 16 నుండి మార్చి 12 వరకూ యాత్ర సాగగా ఆద్యంతం జనం జగన్కు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యమంత్రి కావాలంటూ దీవించారు. రైతులు, కార్మికులు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు యువత ఆయనతో కలసి అడుగులు వేశారు. వారికష్టాలు చెప్పుకున్నారు. చంద్రబాబు మోసాలను జగన్కు వివరించారు. వైఎస్ పాలనలో జరిగిన మేలును గుర్తు చేసుక్నునారు. ప్రజలు తమ వినతులను తెలియచేశారు. చిన్నారులకు పేర్లుపెట్టించుకుని తల్లితండ్రులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
హామీల వరాలు...
ఈ జిల్లా ప్రజలకు జగన్ వరాల జల్లులు కురిపించారు. బహిరంగ సభల్లో వాటిని ప్రకటించారు.అధికారంలోకి రాగానే రామాయపట్నం పట్నం పోర్టును నిర్మిస్తామని, రాళ్లపాడు ప్రాజెక్టును సైతం పూర్తి చేసి ఈ ప్రాంతవాసులకు నీళ్లిస్తామని జగన్ కందుకూరు సభలో ప్రకటించారు.
♦ ఒంగోలు డెయిరీని అభివృద్ధి చేస్తానని, రైతులకు లీటరుకు 4 రూపాయలు సబ్సీడీ ఇచ్చి ఆదుకుంటామని కొండపిలో జరిగిన రైతుసదస్సులో జగన్ హామీ ఇచ్చారు. పొగాకు రైతులను ఆదుకుంటామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. పంటలు నష్టపోయినవారిని ఆదుకొనేందుకు ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
♦ సురక్షిత తాగునీరు అందించి కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ బాధితులను ఆదుకుంటామని కనిగిరి సభలో చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడంతో పాటు పింఛన్లు అందజేస్తామన్నారు.
♦ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని పొదిలి సభలో జగన్ హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు.
♦ గ్రానైట్ క్వారీలతో పాటు ఫ్యాక్టరీలకు రాయల్టీలో, విద్యుత్ చార్జీల్లో సైతం సబ్సీడీ ఇస్తామని చీమకుర్తి సభలో జగన్ హామీ ఇచ్చారు.
♦ అధికారంలోకి వచ్చిన వెంటనే దొనకొండలో పరిశ్రమలు నెలకొల్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
♦ భవనాశి రిజర్వాయర్ పూర్తిచేసి అద్దంకి ప్రాంతానికి సాగు నీరందిస్తామని జగన్ అద్దంకి సభలో హామీ ఇచ్చారు.
♦ రైతులకు అన్ని పంటలకు గిట్టు బాటుధరలు కల్పిస్తామని ఈ ప్రాంతంలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని జగన్ ఇంకొల్లు సభలో చెప్పారు.
♦ చేనేతలను ఆదుకుంటామని చీరాల సభలో జగన్ హామీ ఇచ్చారు.
వీటితో పాటు.. ప్రభుత్వం రాగానే వారం రోజులో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు. మాల మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఆశ వర్కర్లుకు మిగిలిన రాష్ట్రాలలో కన్నా అదనంగా వెయ్యి రూపాయలు జీతం లా అందిస్తామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాలని కందుకూరు సభలో నిర్ణయించారు. హోదాపై పోరు కోసం ఢిల్లీ యాత్రను ప్రారంభించారు. మార్చి 12 చివరి రోజున చీరాల రూరల్ మండలం ఈపురుపాలెం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో ప్రకాశం జిల్లాలో యాత్ర ముగిసింది.