మోసం చేసిన ప్రియుడిపై దాడి | Young Woman tried to castrate her former lover | Sakshi
Sakshi News home page

మోసం చేసిన ప్రియుడిపై దాడి

Nov 29 2013 10:18 AM | Updated on Sep 4 2018 5:07 PM

ప్రేమ.. పెళ్లి పేరుతో వెంట తిప్పుకొని... ఆపై మరో అమ్మాయిన పెళ్లి చేసుకున్న ప్రియుడిపై ఓ యువతి దాడి చేసింది.

హైదరాబాద్: ప్రేమ.. పెళ్లి పేరుతో వెంట తిప్పుకొని ...ఆపై మరో అమ్మాయిన పెళ్లి చేసుకున్న  ప్రియుడిపై ఓ యువతి దాడి చేసింది.  దుండిగల్ పోలీసుల కథనం ప్రకారం.. రాజమండ్రికి చెందిన కాకరపల్లి ప్రతాప్ (32) బాచుపల్లిలో ఉంటూ హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. 2001లో అమలాపురంలోని ఓ కళాశాలలో డిప్లొమో చదివే సమయంలో అదే ప్రాంతానికి చెందిన రమ్యతో పరిచయం ఏర్పడింది. రమ్యను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రతాప్ ఆమెను లోబర్చుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే అతను బాచుపల్లికి వచ్చి స్థిరపడగా రమ్య చందానగర్‌లో ఉంటోంది. కాగా, మే నెలలో ప్రతాప్‌కు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. విషయం తెలుసుకున్న రమ్య పెళ్లి పేరుతో ప్రతాప్ తనను మోసం చేశాడని చందానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేయగా... బెయిల్‌పై వచ్చి జూన్‌లో విడుదలయ్యాడు. నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయిని ఆగస్టులో పెళ్లి చేసుకున్నాడు.

ఈ క్రమంలో రమ్య బుధవారం ఉదయం 10 గంటలకు బాచుపల్లిలోని ప్రతాప్ ఇంటికి వచ్చింది. అదే సమయంలో స్నానం చేసి లుంగీపై బయటకు వస్తున్న ప్రతాప్ మర్మాంగంపై తన వెంట తెచ్చుకున్న చిన్న కత్తితో దాడి చేసేందుకు యత్నించింది. ప్రతాప్ తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో తొడపై గాయాలయ్యాయి. వెంటనే ప్రతాప్‌ను ఇంట్లోకి గెంటివేసి బయట గడియ పెట్టి రమ్య పరారైంది. తేరుకున్న ప్రతాప్ తన స్నేహితుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో అతడు వచ్చి ప్రతాప్‌ను ఆస్పత్రికి తరలించారు. అదే రోజు రాత్రి దుండిగల్ పోలీసులకు రమ్యపై ప్రతాప్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement