మహిళలపై అకృత్యాల్లో ఉమ్మడి ఏపీ టాప్ | Women, depredations joint AP Top | Sakshi
Sakshi News home page

మహిళలపై అకృత్యాల్లో ఉమ్మడి ఏపీ టాప్

Jul 3 2014 1:17 AM | Updated on Sep 2 2017 9:42 AM

ఉమ్మడి రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా వెల్లడించిన 2013 గణాంకాల ప్రకారం మహిళలపై జరుగుతున్న

తాజాగా విడుదలైన ఎన్‌సీఆర్‌బీ నివేదికలో వెల్లడి
2013లో మహిళలపై జరిగిన నేరాల కేసులు 32,809

 
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా వెల్లడించిన 2013 గణాంకాల ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2012 నాటి లెక్కలతో పోలిస్తే... మహిళలపై నేరాలకు సంబంధించి దాదాపు ప్రతి అంశంలోనూ పెరుగుదల నమోదైంది. 2012లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు వ్యతిరేకంగా సంబంధించి 28, 171 కేసులు నమోదు కాగా... 2013 నాటికి ఆ సంఖ్య 32,809కి చేరింది. 2012లో దేశంలోనే అత్యధిక కేసులతో ప్రథమ స్థానంలో నిలిచిన పశ్చిమ బెంగాల్ 2013లో 29,826 కేసులతో రెండో స్థానానికి వచ్చింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 10.59 శాతం కేసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే  రాష్ట్రంలోనే రిజిస్టరయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాది కాలంలో 1,635 అత్యాచారాలు (2012లో 1,341), 1,595 కిడ్నాప్‌లు (2012లో 1,403), 492 మంది వరకట్న వేధింపుల మరణాలు (2012 లో 504) నమోదయ్యాయి. మహిళలపై జరుగుతున్న నేరాల్లో సగానికిపైగా పరిచయస్తులు, బంధువులవల్లే జరిగినవని ఎన్‌సీఆర్బీ వెల్లడించింది.

 ఎస్సీ, ఎస్టీలపై దాడుల్లో నాలుగో స్థానం

ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసుల నమోదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ (7078), బీహార్ (6,721), రాజస్థాన్ (6,475) తరవాత ఆంధ్రప్రదేశ్‌లో 3,270 కేసులు నమోదయ్యాయి.
 
 

Advertisement
 
Advertisement
Advertisement