అనుకున్నదొకటి..అయినదొకటి...!


- హైకోర్టు కన్నెర్రతో మొదటికే మోసం

- సింగిల్ విండో పాలక వర్గం రద్దుతో డీలా

- తర్జన భర్జనలో బీవీ రెడ్డి..?    

కురబలకోట :
కురబలకోట సింగిల్ విండో (పీఏసీఎస్) పాలక వర్గాన్ని హైకోర్టు రద్దు చేయడంతో సంబంధిత అధ్యక్షుడితో పాటు డెరైక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అనుకున్న దొక్కటి.. అయ్యిందొక్కటిలా తయారైన విండో పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏమి చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన సీఈఓ భాస్కర్‌రెడ్డిపై చర్యలు ఉంటాయని అందరూ భావించారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది. హైకోర్టు ఆదేశాలపై విండో అధ్యక్షుడు బీవీ రెడ్డి సకాలంలో స్పందించక పోవడంతో కోర్టు కన్నెర్రకు కారణమైంది. సస్పెన్షన్‌లో ఉన్న సీఈఓ భాస్కర్‌రెడ్డికి నిబంధనల మేరకు జీతభత్యాలు ఇవ్వడం, లేదంటే విధుల్లోకి చేర్చుకోవడం చేయాలని హైకోర్టు ఆదేశించింది.



దీనిపై సకాలంలో చర్యలు తీసుకోక పోవడంతో సీరియస్‌గా భావించిన ఉన్నత న్యాయస్థానం ధిక్కారం కింద ఏకంగా పాలక వర్గాన్నే రద్దు చేసింది. దీనికి తోడు సకాలంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించక పోవడం కూడా పాలక వర్గం రద్దుకు మరో కారణమైంది. ఊహించని రీతిలో ఈ పరిస్థితి ఎదురు కావడంతో ఐదేళ్ల కుర్చీని రెండేళ్లకే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి పాలక వర్గానికి పెద్ద షాక్ . సింగిల్ విండో ఎన్నికలు కూడా పోటాపోటీగా జరిగినా బీవీ రెడ్డి ధీటుగా ఎదుర్కొన్నారు. హైకోర్టు పరీక్షలో ఫెయిల్ అవ్వడంతో మొదటికే ఎసరు వచ్చిందని పలువురు భావిస్తున్నారు. పాలక వర్గం రద్దుతో పర్సన్ ఇన్‌చార్జిగా ప్రవీణ్‌ను నియమించినట్లు డీఆర్ రామ్మూర్తిరెడ్డి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top