భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య | Wife ignores, Husband suicide | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య

Aug 8 2013 4:08 AM | Updated on Jul 27 2018 2:18 PM

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎల్కపెల్లి(బి) గ్రామంలో చోటు చేసుకుంది.

బెజ్జూర్, న్యూస్‌లైన్ : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎల్కపెల్లి(బి) గ్రామంలో చోటు చేసుకుంది. ఇన్‌చార్జి ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్లే వెంకటికి భార్య అమృత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అమృత ఆరు నెలల క్రితం భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఆమెను కాపురానికి రావాలని కోరినా రావడం లేదు. దీంతో మనస్తాపం చెందిన వెంకటి(28) మంగళవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందుతాగాడు. బుధవారం ఉదయం సిర్పూర్‌లోని వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మృతుడి తల్లి తారాబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్సై వివరించారు.
 
 మానసిక క్షోభతో యువకుడు..
 ఆసిఫాబాద్ : యజమాని మృతితో మానసిక క్షోభకు గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని సందీప్‌నగర్‌లో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై సాదిక్‌పాషా కథనం ప్రకారం.. సందీప్‌నగర్‌కు చెందిన కాడె సంజూ(21) కాగజ్‌నగర్‌కు చెందిన ఫ్రిజ్ మెకానిక్ వద్ద పనిచేస్తున్నాడు. రాత్రి పట్టణంలో గుర్ఖాగా ఉంటున్నాడు. ఇటీవల రాజన్న అనారోగ్యంతో మృతిచెందాడు. అతడి అంత్యక్రియలకు కాగజ్‌నగర్ వెళ్లిన సంజూ మూడు రోజులపాటు అక్కడే ఉన్నాడు. మంగళవారం తిరిగి వచ్చి రాత్రి 11గంటల సమయంలో గుర్ఖా విధులకు వెళ్లాడు. వేకువజామున 3గంటలకు వచ్చి ఇం ట్లో పడుకున్నాడు. కుటుంబ సభ్యులు ఉదయం చూసేసరిగి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపిం చాడు. మృతుడి తల్లి కోకిల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
 
 మతిస్థిమితం లేని మహిళ..
 మందమర్రి రూరల్ : మండలంలోని సారంగపల్లి గ్రామానికి చెందిన అయోషా బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. అయోషా పదేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. మతిస్థిమితం సరిగా లేని ఆమె ఇదివరకు పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. ఆమెకు కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement