
విశాఖపట్నం టూ హైదరాబాద్ @ 4000
విశాఖపట్నం నుంచి బెంగళూరుకు రూ. 5500, చెన్నైకి రూ. 4500, హైదరాబాద్కు రూ.4000... ఈ ఛార్జీలు విమానాలకు అనుకుంటే పొరపాటే.
విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి బెంగళూరుకు రూ. 5500, చెన్నైకి రూ. 4500, హైదరాబాద్కు రూ.4000... ఈ ఛార్జీలు విమానాలకు అనుకుంటే పొరపాటే. విశాఖ నుంచి ఆయా ప్రాంతాలకు బయల్దేరే బస్సు టికెట్ ఛార్జీలివి. హుదూద్ తుపాన్ ప్రభావంతో విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలను అమాంతంగా పెంచేశారు. విమాన, రైల్వే సర్వీసులు లేకపోవడం ఆపరేటర్లకు కలిసొచ్చింది.
కేవలం ఇతర ప్రాంతాలకు రాత్రి వేళ సర్వీసులు నడిపే ఆపరేటర్లు పగలు కూడా సర్వీసులు ప్రారంభించారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన బస్సులతో సర్వీసులు నడుపుతున్నారు. కాకినాడ, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల నుంచి టూరిస్టు క్యాబ్లతో ఆపరేటర్లు వ్యాపారం చేస్తున్నారు. మరో వారం రోజులు వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. ఆర్టీసీ దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు అంతంత మాత్రంగానే నడపడంతో ప్రైవేట్ ఆపరేటర్లు సర్వీసులు బాగా పెంచారు.